×
Ad

Adimulapu Suresh : రెండు, మూడు రోజుల్లో టెన్త్ ఫలితాలు.. మంత్రి కీలక ప్రకటన

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు

  • Published On : July 28, 2021 / 04:29 PM IST

Adimulapu Suresh

Adimulapu Suresh : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. కరోనా వల్ల పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులందరూ పాస్ అయినట్లేనని మంత్రి స్పష్టం చేశారు. కాగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2020, 2021 సంవత్సరాల్లో టెన్త్ విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

స్లిప్ టెస్టులకు 70శాతం, ఫార్మాటివ్ ఎసెస్ మెంట్ కు 30% వెయిటేజ్ తో మార్కుల కేటాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఛాయారతన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 6.28 లక్షల మంది విద్యార్థులు రిజల్ట్స్ విడుదల చేయనున్నామని వెల్లడించారు. ఇక ఎంసెట్ ర్యాంక్స్ లో ఇంటర్ కు ఇచ్చే 25శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని మంత్రి సురేష్ మరోసారి స్పష్టం చేశారు. గత వారమే ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఎలాగైనా బోర్డు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదల చూపినా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసింది.