Shining AP: అమరావతిపై పార్లమెంట్ లో చట్టం.. పేదలకు ఇళ్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. చైనా, రష్యా, జపాన్, సింగపూర్ కి మించి..

ఏడాది పాలనలో ఏమేం చేశారో వివరించారు.

Narayana

గత వైసీపీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కారు ఏడాది పాలనపై 10 టీవీ మెగా ఈవెంట్ “షైనింగ్ ఏపీ” నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నారాయణ ఏపీ ఏడాది పాలనపై మాట్లాడారు.

కూటమి సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందని నారాయణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. “టిడ్కో హౌసెస్‌ను ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టాం. 7 లక్షల హౌసెస్‌ను 2014-2019 మధ్య శాంక్షన్ చేశాం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి 2 లక్షల 61 వేలు చేసింది. అవి అయినా కంప్లీట్ చేయకుండా వదిలేసింది.

ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఒక విషయం చెప్పారు. ప్రతి మహిళ, తన భర్తాపిల్లలతో ఆనందంగా ఉండేటట్లు ఇళ్లు కట్టాలని నాతో అన్నారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశాల్లో తిరిగాను. చైనా, రష్యా, జపాన్ సింగపూర్, మలేషియా వెళ్లాను. అక్కడ పేదలకు ఇళ్లు ఎలా ఉన్నాయో స్టడీ చేశాను. ముఖ్యమంత్రికి వివరించాను. ఉన్నదాని కంటే బెటర్‌గా చేయాలని సీఎం అన్నారు. వాటిన్నింటిని కూడా వైసీపీ సర్కారు నిర్వీర్యం చేసింది. మళ్లీ ఇప్పుడు అన్నింటినీ చక్కదిద్దుతున్నాం” అని అన్నారు.

Also Read: అమరావతి ఇక ఆగేదే లే.. టార్గెట్ ఫిక్స్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం..

అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.5కు 2 లక్షల 25 వేల మంది ప్రతిరోజు భోజనం చేస్తున్నారని నారాయణ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసేసిందో తెలియదని అన్నారు. అన్నా క్యాంటీన్ల బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తనకే ఇచ్చారని తెలిపారు. ఇందుకోసం తాను అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసి వచ్చానని, అక్కడ అమలు అవుతున్న ఇటువంటి పథకాన్ని పరిశీలించామని చెప్పారు.

ఏడాదిలో ఇన్ని చేశాం..
ప్రభుత్వం ఏర్పడగానే రూ.4 వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పామని, వికలాంగులకు రూ.6 వేలకు పెంచామని, మంచానికి పరిమితమై అటెండర్‌ సాయంతో వచ్చే వాళ్లకు రూ.15 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఏడాదికి పెన్షన్ల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఇది మామూలు విషయం కాదని తెలిపారు. దాదాపు 68 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు.

మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తున్నామని అన్నారు. తల్లికి వందనంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి నగదు ఇస్తున్నామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇస్తున్నామని అన్నారు. ఆగస్టు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇంకా ఏమన్నారు?