తెలుగుదేశం జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా: మంత్రి వేణుగోపాలకృష్ణ
తాడేపల్లిగూడెంలో సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 29, 2024 / 10:35 AM IST
minister venugopala krishna counter to pawan kalyan comments
Chelluboyina Srinivasa Venugopala Krishna: టీడీపీ, జనసేన సంయుక్తంగా తొలిసారిగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన సమావేశంలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి సభలో చంద్రబాబు నాయుడు జూనియర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆశయం లేని పవన్ కళ్యాణ్ కాసుల కోసం పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా అని, జనసేన పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యాన్ని పవన్ కళ్యాణ్ పాడు చేస్తున్నారని అన్నారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి వేణు చెప్పారు. జగన్ ని అధఃపాతాళానికి తొక్కేయడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకే తాడేపల్లిగూడెంలో సభ పెట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.. ప్రజాస్వామ్యంలో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలనే నమ్ముకున్నారని.. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: పవన్ కల్యాణ్కు ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం.. తనను లాస్ట్ గ్రేట్లో పెట్టారని ఆవేదన
