Bommi Israel : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్. దళితుడు, సామాన్యుడు అయిన తనను సీఎం జగన్ ఎమ్మెల్సీని చేశారని ఆయన అన్నారు. దళితులు, బడుగువర్గాల తరపున జగన్ కు రుణపడి ఉంటానని చెప్పారు. తన గెలుపు కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టిన మహనీయుడు వైఎస్ జగన్ అని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ ప్రశంసించారు.
”నా లాంటి సామాన్యుడికి గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్ తొలి ప్రాధాన్యత ఓటుతో నేను ఎమ్మెల్సీ అయ్యాను. దళిత సామాజిక వర్గానికి చెందిన నాకు తొలి ఓటు సీఎం వేయడం ఆనందంగా ఉంది. నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటా. జగన్ వెంటే ఉంటా” అని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ రేపాయి. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా.. 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.
Also Read..Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు
వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్ (22 ఓట్లు), ఏసురత్నం (22), పోతుల సునీత (22), సూర్యనారాయణరాజు (22), మర్రి రాజశేఖర్ (22) గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో… రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ అంతిమ విజయం సాధించారు. వెంకటరమణ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరారు.