MLC Elections Results 2023: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ షురూ.. అభ్యర్థుల్లో టెన్షన్
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
- Harishth Thanniru
- Published On : March 16, 2023 / 07:52 AM IST
MLC Elections Results
MLC Elections Results 2023: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో మొత్తం తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది. మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొమ్మిది స్థానాలకు మొత్తం 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్ పేపర్ల పరిశీలన ఉంటుంది. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు మధ్యాహ్నం 1గంటలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు అర్థరాత్రి వరకు, గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ఎల్లుండి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 16న ఫలితాలు వెల్లడి
ఇదిలాఉంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల నిబంధనావళిని అధికార వైసీపీ యథేచ్ఛగా ఉల్లంఘించిందని అన్నారు. 2019 తర్వాత తిరుపతిలో జరిగిన వివిధ ఎన్నికల్లో అధికార వైసీపీ అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలు, బోగస్ ఓట్ల నమోదు, ఎన్నికల అధికారుల అధికార దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు చంద్రబాబు బుధవారం ఏడు పేజీల లేఖ రాశారు. ఇదిలాఉంటే అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని వైసీపీ ధీమాను వ్యక్తంచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగనుంది. ఇందుకోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తిచేయగా, ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల కౌంటింగ్కు దాదాపుగా 300 మంది సిబ్బంది పాల్గొంటుండగా, కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ -రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
