naga statues on krishna river
Naga Statues – krishna river : ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలీదుగానీ కృష్ణానదీ తీరంలో నాగ ప్రతిమలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సమీపంలో కృష్ణానది కరకట్ట దిగువన నాగ ప్రతిమలు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు వెలుగు చూశాయి.
50కి పైగా నాగ దేవతల విగ్రహం కుప్పగా పడి కనిపిస్తున్నాయి. ఇవి నీటినుంచి బయటపడ్డాయా? లేక ఎవరన్నా తెచ్చి అక్కడ పెట్టిపోతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విగ్రహాలు ఉన్నచోట ఓ వ్యక్తి జపం చేసి వెళుతున్నాడనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అసలు ఈ విగ్రహాలు అక్కడకు ఎలా వస్తున్నాయి? నది నీటినుంచి కొట్టుకొచ్చాయా? కొట్టుకొచ్చినట్లైతే అన్నీ ఒక్కచోటే ఎందుకు ఆగుతాయి? లేదా ఎవరైనా కావాలనే వీటిని ఇక్కడకు తీసుకొచ్చి వదిలి వెళుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి జపం చేసి వెళుతున్నట్లుగా అనుమానాలు కలుగుతున్న క్రమంలో ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడికి వచ్చి ఎందుకు జపం చేస్తున్నాడు? ఈ విగ్రహాల వెనుక ఏ కథ దాగుంది? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విగ్రహాల మిస్టరీని అధికారులు ఎలా చేధిస్తారో వేచి చూడాలి.
ఈ నాగ ప్రతిమలు దెబ్బతిని ఉండటం..ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే నదిలో కలిపే సంప్రదాయం ఉండటం..వీటిని నీటి ఒడ్డున వదిలివెళ్లి ఉంటారని అనుమానాలు నివృతం కావాల్సి ఉంది. గతంలో కూడా ఇటువంటి ఘటనలే జరిగాయని.. పశ్చిమ డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నాగదేవత ప్రతిమలను వదిలివెళ్లినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి కూడా అదే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.
AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వర్షాలు, సముద్రంలో అల్లకల్లోలం