నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?
నాగబాబు ట్వీట్ ప్రకారం.. కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తుచేసుకోవాలంటూ న్యూటన్స్ నియమాలతో పోస్టు చేశారు. అంటే.. చర్యలకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా నాగబాబు పోస్టు చేశారు.
- Harishth Thanniru
- Published On : January 27, 2024 / 12:32 PM IST
Nagababu
Nagababu Comments : టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించిందని పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాజాగా జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ జనసేన-టీడీపీ మధ్య అసలేం జరుగుతోందన్న చర్చకు తెరలేపింది. నిన్న పవన్ మాట్లడుతూ.. టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించిందని, ఏకపక్షంగా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిందని, ప్రతిగా తాను రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తానని అన్నారు. అంతేకాక, జనసేన పోటీచేసే రెండునియోజకవర్గాలతోపాటు అక్కడ రేసులో ఉన్న జనసేన అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు. అయితే, టీడీపీ నేతలు పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు. టీడీపీ -జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయిందని, జనసేన పోటీచేసే సీట్లనే పవన్ కల్యాణ్ ప్రకటించారని టీడీపీ నేతలు అన్నారు. దీంతో.. ఈ విషయం సమసి పోయిందని అనుకుంటున్న సమయంలో తాజాగా పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ తో అసలు టీడీపీ – జనసేన మధ్య ఏం జరుగుతుందనే అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read : నెల్లూరులో కాక.. మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్కు షాక్!
నాగబాబు ట్వీట్ ప్రకారం.. కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తుచేసుకోవాలంటూ న్యూటన్స్ నియమాలతో నాగబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. అంటే.. చర్యలకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా నాగబాబు పోస్టు చేశారు. అయితే, తాను పెట్టే ప్రతీపోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దని నాగబాబు అన్నారు. కొన్నిసార్లు సమాచారం మాత్రమే పోస్టు చేస్తానని, ఇప్పుడు ఫిజిక్స్ లాస్ పెట్టానని తెలిపారు. రేపు మరికొన్ని పోస్టులు కూడా చేస్తానని నాగబాబు అన్నారు. అయితే, నాగబాబు ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిన్న పవన్ కల్యాణ్, నేడు నాగబాబు జనసేన -టీడీపీ పొత్తుపై ప్రస్తావించడంతో టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతుందన్న చర్చకు దారితీసింది.
Also Read : AP Politics: బీసీ ఓట్ల కోసం వైసీపీ, టీడీపీ వ్యూహాలు.. ఏం జరుగుతుందో తెలుసా?
నాగబాబు ట్వీట్ తెలుగుదేశం పార్టీకి ఓ సందేశం పంపించాలన్నట్లుగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పొత్తు ధర్మం పాటించకుండా ముందుకెళ్తే అందుకు ప్రతిచర్యకూడా ఉంటుందని నాగబాబు టీడీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు చేసినట్లుగా కూడా ఆయన ట్వీట్ ఉందని పలువురు నేతలు పేర్కొంటున్నారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం నిన్న పవన్ వ్యాఖ్యలను, ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలను తేలిగ్గానే తీసుకుంటున్నారు. టీడీపీ -జనసేన రెండు పార్టీలు రాబోయే పది సంవత్సరాలు పొత్తులో ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు, నాగబాబు ట్వీట్ వైసీపీ నేతలకు కౌంటర్ గా ఉందని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఇటీవల పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వారి విమర్శలకు కౌంటర్ గా నాగబాబు ఈ ట్వీట్ చేసిఉంటారని పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి నాగబాబు ప్రస్తుతం చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
