మరో అపచారం, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాల కలకలం, ఇది ఎవరి పని?

  • Published By: naveen ,Published On : September 12, 2020 / 01:04 PM IST
మరో అపచారం, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాల కలకలం, ఇది ఎవరి పని?

Updated On : September 12, 2020 / 1:29 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కొత్త విగ్రహాలు కలకలం రేపుతున్నాయి. ఆలయంలో అనధికారికంగా శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. గర్భాలయానికి సమీపంలోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది సహకారంతోనే వీటిని ఏర్పాటు చేసినట్లు భక్తులు అనుమానిస్తున్నారు. అయితే వెంటనే ఆ విగ్రహాలను తొలగించి.. అదే స్థలంలో సంప్రోక్షణ జరిపారు ఆలయ ప్రధాన అర్చకులు. ఈ ఘటనపై ఆలయ అధికారులు విచారణ చేపట్టారు.

సెక్యూరిటీ కళ్లు గప్పి:
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొత్త ప్రతిమలు ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ కళ్లు గప్పి సెప్టెంబర్ 8న వాటిని ఇక్కడ పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. భక్తులు లోపలికి వచ్చేటప్పుడు భద్రతా సిబ్బంది సక్రమంగా తనిఖీలు చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రతిమలను గుర్తించిన వెంటనే అర్చకులతో చర్చించిన ఈవో చంద్రశేఖరరెడ్డి సంప్రోక్షణ చేయించారు. సాధారణంగా ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించాలంటే అధికారుల అనుమతితో ఆగమోక్తంగా పూజా విధానంతో అమర్చాలి.


https://10tv.in/nep-2020-prepared-after-widespread-consultation-with-over-2-lakh-stakeholders-modi/
ఇప్పటికే అంతర్వేది ఆలయ ఘటనపై రచ్చ:
ఇప్పటికే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటన రాజకీయ రంగు పులుకుంది. హిందుత్వ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. అంతర్వేది ఘటన మరువకముందే తాజాగా శ్రీకాళహస్తిలో మరో అపచారం చోటుచేసుకోవడం భక్తులను బాధించింది.




హిందువుల మనోభావాలు కాపాడాలని డిమాండ్:
అంతర్వేదీ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధపడటంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలోనే మళ్లీ ఇలా శ్రీకాళహస్తిలో ఈ ఘటన వెలుగుచూడటంపై మరోసారి రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. శ్రీకాళహస్తిలోని గాలిగోపురం దగ్గర ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. హిందువుల మనోభావాలను కాపాడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువుల దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా మరోసారి టీడీపీ నేతలు నిరసన వ్యక్తంచేశారు. వరుస ఘటనలపై హిందూ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.