ఏపీలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా Anganwadiల్లో పోస్టుల భర్తీగా జిల్లాలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది గవర్నమెంట్. ఖాళీ అయిన 5వేల 905 పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించడంతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా ప్రక్రియను చేపట్టారు. ప్రధాన అంగన్వాడీలు, మినీ అంగన్వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు. 4వేల 7 అంగన్వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్వాడీ వర్కర్లు, వెయ్యి 468 మెయిన్ అంగన్వాడీల్లో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు మాత్రమే విడుదల చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి పోస్టుల భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 2019 ఖాళీల ఆధారంగా జిల్లాలో 654 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 3వేల 102 దరఖాస్తులు అందాయి. అభ్యర్ధుల కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది. మెయిన్ అంగన్వాడీల్లో వర్కర్లకు రూ.11వేల 500, మినీ అంగన్వాడీల్లో వర్కర్లకు రూ.7 వేల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు. హెల్పర్లకు కూడా రూ.7వేల చొప్పున వేతనాన్ని అందజేస్తారు.
ఓపెన్గా పోస్టుల భర్తీ
రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీల్లో 48వేల 770 వర్కర్లు ఉండాలి. ప్రస్తుతం 47వేల 302 మంది మాత్రమే ఉన్నందున వెయ్యి 468 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్ అంగన్వాడీల్లో 48వేల 770 హెల్పర్లకు బదులుగా 44వేల 763 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 4వేల 7 హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మినీ అంగన్వాడీల్లో 6వేల 837 వర్కర్లు ఉండాలి. ప్రస్తుతం 6వేల 407 మంది మాత్రమే ఉన్నందున 430 పోస్టుల భర్తీ జరుగుతోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపట్టి అర్హుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.