×
Ad

తమిళనాడును తాకిన తిరుమల లడ్డూ వివాదం.. AR డెయిరీ ఫుడ్ కంపెనీపై అధికారుల దాడులు

సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

  • Published On : September 20, 2024 / 09:22 PM IST

Raids On AR Dairy Food : తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. తమిళనాడును తాకింది. టీటీడీ ఇచ్చిన సమాచారంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీపై దాడులు చేశారు. అలాగే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపివేశారు. ఏఆర్ డెయిరీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఏపీ ప్రభుత్వం రిపోర్టును బయటపెట్టింది. దీంతో తమిళనాడులో భక్తుల్లో ఆందోళన మొదలైంది.

Also Read : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్.. సీఎం చంద్రబాబుకి కీలక ఆదేశం

సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, పళని ఆలయానికి ఆవిన్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తుందని తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

 

నెయ్యి వివాదంపై తమిళనాడుకి చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డెయిరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామంది. జూన్-జూలై నెలల్లో నెయ్యిని సరఫరా చేశామంది. తమ కంపెనీ తయారు చేసే నెయ్యికి ఎలాంటి టెస్టులైనా చేసుకోవచ్చని తెలిపింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏఆర్ డెయిరీ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ నెయ్యిని NDDBలో పరీక్షించామని, ఎలాంటి కల్తీ లేదని రిపోర్టు వచ్చిందని వెల్లడించింది.