PM Modi AP Tour: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. నేడు ఏయూలో బహిరంగ సభ.. వేదికపై మోదీ, జగన్సహా నలుగురే ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా ఇవ్వాళ ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభ పాల్గోనున్నారు. సభావేదిక వద్దనే రూ. 15,233 కోట్లు విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
- Harishth Thanniru
- Published On : November 12, 2022 / 08:37 AM IST
PM Modi vishaka Tour
PM Modi AP Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా నేడు ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గోనున్నారు. శుక్రవారం రాత్రి విశాఖపట్టణంకు చేరుకున్న ప్రధానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని రోడ్ షో ద్వారా నౌకాదళ వాయుస్థావరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని అక్కడే బసచేశారు. నేడు ప్రధాని మోదీ రూ. 15,233 కోట్లు విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Pawan Kalyan Meets PM Modi : ప్రధాని మోదీతో పవన్ భేటీ.. తాజా రాజకీయ పరిణామాలు, కలిసి పనిచేయడంపై చర్చ
మోదీ పర్యటన ఇలా..
శనివారం ఉదయం సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ లు మోదీతో భేటీ అవుతారు. అనంతరం వారు ముగ్గురు ఉదయం 10:25 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగా నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. 10:30 గంటలకు ఏయూకు చేరుకుంటారు. ఏయులో ఏర్పాటు చేసిన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఏయూ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. బహిరంగ సభాప్రాంగణంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. మొదటి వేదికపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లు ఉంటారు. రెండో వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు 15మంది బీజేపీ నేతలు పాల్గొంటారు. రెండో వేదిక సమీపంలోనే 300 మంది ప్రముఖులు ఆశీనులయ్యేలా మరో వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు సుమారు 2లక్షల మందిని తరలించేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సభలో మోదీ సుమారు 40నిమిషాల పాటు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:10 గంటలకు ఏయు నుండి ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని తిరిగి వెళ్తారు.
మోదీ జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు ..
– మోదీ ఏపీ పర్యటనలో భాగంగా ఇవ్వాళ రూ.7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
– రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి.
– రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్జీసీ యు ఫీల్డ్ ఆన్షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్
– రూ.385 కోట్లతో గుంతకల్లో ఐఒసిఎల్ గ్రాస్ రూట్ పీవోఎల్ డిపో నిర్మాణం.
– రూ.4,106 కోట్లతో విజయవాడ – గుడివాడ భీమవరం- నిడదవోలు, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్.
ప్రధాని శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టులు ..
– ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భాగంగా రూ.7,614 కోట్లు విలువైన ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
– రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ.
– రూ.3,778 కోట్లతో రాయ్పూర్ – విశాఖపట్నం ఆరులైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్.
– రూ.66 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్కు ప్రత్యేకమైన రోడ్డు.
– రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి.
– రూ.2,658కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం- అంగుల్కు గెయిల్ పైప్ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.
