Ramesh Naidu: ఏపీలో సంచలన రాజకీయ మార్పులు.. జగన్ కు త్వరలో షాక్ తగలబోతోంది..
వైసీపీ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని.. జగన్ కు త్వరలో తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు షాక్ ఇవ్వబోతున్నారని రమేష్ నాయుడు చెప్పారు.
- Naga Srinivasa Rao Poduri
- Updated on- April 25, 2023 / 01:01 PM IST
నాగోతు రమేష్ నాయుడు (Photo: Twitter)
Ramesh Naidu Nagothu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. జగన్ కు త్వరలో తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు షాక్ ఇవ్వబోతున్నారని చెప్పారు. ఏపీలో జగన్ పాలనపై గాడి తప్పిందని, సొంత పార్టీపై కూడా ఆయన పట్టు కోల్పోయారని తెలిపారు.
శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?
వైఎస్ జగన్ పాలించే అర్హత కోల్పోయి చాలా కాలమైందని, ప్రజలు జగన్ ను భరించే పరిస్థితిలో లేరని విమర్శించారు. సీఎం జగన్ తన కుటుంబంపై పెట్టిన శ్రద్ద రాష్ట్రశ్రేయస్సు కోసం పెట్టడం లేదని ఆరోపించారు. జగన్ కేవలం తాను దోచుకోవడం, దాచుకోవడం మీదే ఆసక్తి చూపుతున్నారని అందరికీ అర్దమయిందన్నారు. రాయలసీమ (Rayalaseema) లో ఉన్న ప్రజలు సైతం తమ ప్రాంతాన్ని పక్క రాష్ట్రంలో కలపాలనే డిమాండ్లు పెరుగుతున్నాయని.. ఇక్కడ ఉండలేమని చెప్పే స్థితికి ప్రజలను తీసుకు వచ్చిన ఘనత జగన్ కే చెందుతుందని ఎద్దేవా చేశారు. రాయలసీమలో తాను చేపట్టిన పనులపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేసే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు.
వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు?
జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ధాన్యం కొనకపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారని రమేష్ నాయుడు(Ramesh Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ వినియోగించే రైతులకు జగన్ సర్కారు సబ్సిడీ తొలగించిందని ఆరోపించారు. మోదీ పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా వైసీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. పేదలు తినే బియ్యాన్ని రీ సైకిలింగ్ చేసి విదేశాలకు పంపుతున్న వైసీపీ నేతలపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Also Read: రాయల తెలంగాణ కావాలన్న జేసీ దివాకర్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత జగన్ కు తగిన గుణపాఠం చెప్పారని.. ఈ ఫలితాల తర్వాత మంత్రి బొత్స సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో వైఎస్ జగన్ (YS Jagan) బాధితులను మోసం చేశారని ఆరోపించారు. బాధితులకు అండగా నిలిచేందుకు కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నట్టు చెప్పారు.
Also Read: వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టర్లు.. ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్
