Karnataka elections 2023: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సోమవారం వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ అధికారులు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka elections 2023) మద్యం, నగదు అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దుల్లోని జిల్లాల్లో నగదు, మద్యం వరదను కట్టడి చేయాలని కోరారు. కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధన ప్రవాహం మరింత పెరిగింది.
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా మద్యం, నగదు, ఇతర వస్తువులను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్, ఇతర ఎలక్షన్ కమిషనర్లతో కలిసి ప్రభుత్వ ప్రధాన అధికారులు, డీజీపీలు, ప్రధాన ఎన్నికల అధికారులు (CEOs), ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఇందులో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి, సీఈవో ముకేశ్ కుమార్ మీనా, ప్రత్యేక సీఎస్ రజత్ భార్గవ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దుల్లోని జిల్లాల్లో నగదు, మద్యం వరదను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు ఏపీ అధికారులు. కాగా, కర్ణాటక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు ఆ రాష్ట్రంలో పర్యటనలు జరుపుతున్నారు.
Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్ఆర్సీ’ వాగ్దానం.. మరో వివాదానికి తెరలేపిన బీజేపీ