Kolikapudi Srinivasarao: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్
కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొలికపూడిపై టీడీపీ అధిష్ఠానం తదుపరి చర్యలు తీసుకోనుంది.
- T Venkateshwarlu
- Published On : January 18, 2025 / 04:44 PM IST
Kolikapudi Srinivasarao
ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. జనవరి 11వ తేదీన ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను పార్టీ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలని అధిష్ఠానం చెప్పింది. తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనుంది క్రమశిక్షణ కమిటీ.
కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపూడిపై టీడీపీ అధిష్ఠానం తదుపరి చర్యలు తీసుకోనుంది. కాగా, కొలికపూడి శ్రీనివాసరావు ఎ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ రోడ్డుకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లారు. ఆయన వెళ్లిన సమయంలో దారి గొడవలో జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి కొట్టారంటూ గ్రామానికి చెందిన వైసీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగుమందు తాగారు. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
