Varla Ramayya: కడప కేంద్ర కారగార జైలర్ పి.వరుణారెడ్డిని బదిలీ చేయండి: వర్ల రామయ్య
డప కేంద్ర కారగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.
- Bharath Reddy
- Published On : February 15, 2022 / 09:05 AM IST
Varla
Varla Ramayya: మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ప్రాణహాని ఉందని, ప్రస్తుతం కడప కేంద్ర కారగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. కడప కేంద్ర కారగార జైలర్ పి. వరుణారెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేయాలని కోరుతూ వర్ల రామయ్య లేఖ రాయడం సంచలనంగా మారింది. సీబీఐ డైరెక్టర్ కు వర్ల రామయ్య రాసిన లేఖ ప్రకారం.. వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ప్రాణాలకు రక్షణ కల్పించే దృష్ట్యా.. నిందితులను కడప కేంద్ర కారాగారం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి మార్చాలని, కుదరని పక్షంలో కడప కారాగారం జైలరుగా ఉన్న వరుణారెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయాలనీ.. వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా ఉన్న వరుణారెడ్డి గతంలో అనంతపురం జిల్లా జైలు జైలర్గా పనిచేసారు. ఆసమయంలో పరిటాల రవీంద్ర హత్యకేసు నిందితులు అనంతపురం జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే 2008 నవంబర్ 11వ తేదీ రాత్రి, పరిటాల రవి హత్యకేసు ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను.. తన జైలు గదిలోనే.. సహ నిందితుడి చేతిలో సిమెంట్ డంబ్ బెల్ తో దారుణంగా హతమార్చబడ్డాడు. ఈ ఘటనతో అప్పటి అనంతపురం జిల్లా జైలు జైలర్ వరుణారెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ కు గురయ్యారని వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు.
Also read: Lakhimpur Kheri: రైతులను హత్య చేసిన ఘటనలో నిందితుడికి బెయిల్
వరుణారెడ్డి తాను పనిచేసిన చాలా చోట్ల తన న్యాయబద్ధమైన విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని తెలిపిన వర్ల.. అందుకు అతనికి అనేక శిక్షలు కూడా పడ్డాయని లేఖలో వివరించారు. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం.. వరుణారెడ్డిపై ఉన్న అన్ని శిక్షలను ఉపసంహరించుకుని అతనిని చేరదీసిందంటూ..వర్ల రామయ్య ఆరోపించారు. నాడు అనంతపురం జైలులో జరిగిన సంఘటనల తరహాలోనే నేడు కడప కేంద్ర కారాగారంలో కూడా జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన వర్ల రామయ్య.. పై విషయాలను దృష్టిలో పెట్టుకుని సీబీఐ అధికారులు స్పందించాలని సూచించారు.
Also read: TTD Sarvadarshanam: సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ
