TDP Mahanadu 2023: రాజమండ్రిలో టీడీపీ భారీ బహిరంగ సభ.. ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్న చంద్రబాబు..
సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
- Harishth Thanniru
- Published On : May 28, 2023 / 08:20 AM IST
TDP Mahanadu
Andhra Pradesh: రాజమండ్రి పసుపు మయంగా మారింది. రెండు రోజులు పాటు టీడీపీ మహానాడు జరుగుతున్న విషయం విధితమే. తొలిరోజు శనివారం ప్రతినిధుల సభ జరిగింది. ఈరోజు సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రెండో రోజు మహానాడు బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సుమారు 15లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అంచనా. ఇందుకు తగినవిధంగా సభాప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం 8గంటలకు కోటిపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు, లోకేశ్ పూలమాలవేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం తిరిగి సభా ప్రాంగణంకు చంద్రబాబు నాయుడు చేరుకుంటారు.
సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శత దినోత్సవం, ఎన్నికల ముందు మహానాడు కావడంతో తెలుగు తమ్ముళ్లు నూతన ఉత్సాహంతో సభకు భారీ సంఖ్యలో హాజరవుతారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్నారు. సంక్షేమం అభివృద్ధి పెంచే దిశగా తొలి మేనిఫెస్టోను చంద్రబాబు ఈ బహిరంగ సభలో విడుదల చేయనున్నారు.
మహానాడులో భాగంగా తొలిరోజు ప్రతినిధుల సభలో కీలకమైన 15అంశాలపై టీడీపీ నేతలు తీర్మానాలు చేశారు. రైతులు, మహిళలు, యువకులకు ప్రయోజనం కలిగే విధంగా తొలి మేనిఫెస్టో ఉంటుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు జరగుతున్నఈ మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రసంగం కీలకంగా మారనుంది. ఇదిలాఉంటే మహానాడు బహిరంగ సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే వారికి గ్రామం బ్రిడ్జి మీదగా కొవ్వూరు, నల్లజర్ల, కొవ్వూరు నిడదవోలు రావులపాలెం. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్లే వాహనాలు రావులపాలెం, మండపేట, కాకినాడ కత్తిపూడి మీదుగా దారి మళ్లింపు చేశారు.
