Pawan Kalyan: కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది.. ఇప్పటం వాసులకు అండగా నిలుస్తాం: పవన్ కల్యాణ్
ఏపీలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లు కూలుస్తుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందన్నారు. శనివారం ఈ గ్రామాన్ని పవన్ సందర్శించబోతున్నారు.
- Narender Thiru
- Published On : November 4, 2022 / 05:32 PM IST
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్, మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లు కూల్చివేస్తుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Kerala: ఎంత అహంకారం.. కారుకు ఒరిగినందుకు బాలుడిని తన్నిన యజమాని.. వీడియో వైరల్
రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లు కూలుస్తూ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని, కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందని విమర్శించారు. శనివారం ఇప్పటం గ్రామాన్ని పవన్ కల్యాణ్ సందర్శించబోతున్నారు. అక్కడ ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల్ని పవన్ పరామర్విస్తారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయని వారిని వైసీపీ శత్రువులుగా చూస్తోంది. గత మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు చోటిచ్చి, సహకరించడమే స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి కారణం. అమరావతిలో సభ జరిపేందుకు ప్రయత్నిస్తే, ఆ సభకు చోటు దొరక్కుండా బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ, ఇప్పటం వాసులు సభ కోసం స్థలం ఇచ్చారు. దీంతో వీరిపై కక్ష సాధించేందుకు రోడ్డు విస్తరణ పేరుతో నోటీసులు ఇచ్చారు.
జాతీయ రహదారికి దూరంగా, ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంది. ఇప్పుడు దీన్ని 120 అడుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపే. ఈ వంకతో తమకు ఓటేయని వారి ఇండ్లు తొలగించాలని చూస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జనసైనికుల్ని, వీర మహిళల్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఇప్పటం వాసులకు జనసేన అండగా నిలుస్తుంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
