Nandigam Suresh : చంద్రబాబు ప్రాణాలకు లోకేశ్ నుంచే ప్రమాదం ఉంది, ఎందుకంటే- వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Nandigam Suresh - Nara Lokesh
- Naveen
- Published On : September 21, 2023 / 04:38 PM IST
Nandigam Suresh - Nara Lokesh (Photo : Google)
Nandigam Suresh – Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, జైల్లోనే చంద్రబాబుని చంపేందుకు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ ప్లాన్ చేశారని నారా లోకేశ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ పై ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉన్నది ఆయన కుమారుడు నారా లోకేశ్, టీడీపీ నేతల నుంచే అని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అన్నారు.
”చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికీ భయపడనని చెప్పే చంద్రబాబు దోమలకు భయపడతారా? చంద్రబాబు ప్రాణాలకు లోకేశ్, టీడీపీ నేతల నుంచే ప్రమాదం ఉంది. చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేశ్ కు అబ్బినట్టుంది. చంద్రబాబు పదవి కోసం లోకేశ్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది. చంద్రబాబుపై ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తున్న వారి ఫోన్లు చెక్ చేయాలి.
Also Read..Nara Lokesh : చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్
అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణం. వీళ్ళు ప్రజా నాయకులా? బాలకృష్ణ మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. పిచ్చోళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. మెంటల్ బాలకృష్ణపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేశ్ ఏపీకి ఎందుకు రావడం లేదు? దొడ్డిదారిన ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు అనుభవించిన లోకేశ్ దోపిడీకి పాల్పడ్డాడు. చంద్రబాబు, లోకేశ్ నిజమైన సైకోలు” అని ఎంపీ నందిగం సురేశ్ ఫైర్ అయ్యారు.
కాగా, చంద్రబాబుకి జైల్లో ప్రాణహాని ఉందని నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకి జైల్లో హాని తలపెట్టేలా జగన్ సర్కార్ కుట్ర చేస్తోందని చెప్పారు. చంద్రబాబుకి జైల్లో భద్రత లేదన్నారు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని లోకేశ్ వాపోయారు. రాజమండ్రి జైల్లో ఓ ఖైదీ డెంగీ బారిన పడి మరణించాడని లోకేశ్ తెలిపారు. చంద్రబాబుకి కూడా ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. జైలులో చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని నారా లోకేశ్ హెచ్చరించారు.
