Varahi, Velampalli Srinivas (Photo: Google/Twitter)
Varahi Velampalli Srinivas : మాజీమంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన ఎన్నికల ప్రచార వాహనం వారాహిని టార్గెట్ చేశారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. వారాహి ఎక్కడ? అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. ప్యాకేజీకి కక్కుర్తిపడిన పవన్ కల్యాణ్.. వారాహిని ఆపుకున్నారని విమర్శించారు.
తన తమ్ముడు నారా లోకేశ్ పాదయాత్రకు ఇబ్బంది కలుగుతుందనే.. పవన్ కల్యాణ్ వారాహిని ఆపేశారని ఆయన ఆరోపించారు. పవన్.. నీ వారాహి ఎక్కడుంది? అని నిలదీసిన వెల్లంపల్లి.. అద్దెకు తిప్పుకుంటున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. వారాహి తిరక్కుండా వైసీపీ నేతలు ఆపుతున్నారని గగ్గోలు పెట్టావు, ఇప్పుడు ప్యాకేజీకి కక్కుర్తి పడి నువ్వే వారాహిని ఆపుకున్నావు అని విమర్శించారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసేది ఆయనకే తెలియదన్నారు. అసలు పోటీ చేస్తున్నారో లేదో కూడా డౌటే అన్నారు. (Varahi Velampalli Srinivas)
Also Read.. Tirupati Assembly Constituency: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?
” రాష్ట్రంలో 20వేల కోట్లు అక్క చెల్లెమ్మలకు ఆసరా కింద నిధులిచ్చారు జగన్. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నా.. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్. మహిళలను చంద్రబాబు, పవన్, బీజేపీ, కమ్యూనిస్టులు 2014 నుంచి 2019 దాకా మోసం చేశారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి జగన్. చంద్రబాబును 2024లో మరోసారి ఓడించేందుకు మహిళలంతా సిద్ధమయ్యారు.
చంద్రబాబు, దత్తపుత్రుడు వైసీపీ సమావేశాలకు రావాలని డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు, పవన్, లోకేశ్ వత్తాసు పలికిన తోక పార్టీలన్నీ పనికిమాలిన వారే. దత్తపుత్రుడు గతంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించారా? 2024లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం. మహిళా ద్రోహులు చంద్రబాబు, లోకేశ్, బీజేపీ.
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడూ పవన్ మాట్లాడలేదు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. పోలవరం, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులిస్తేనే పొత్తులో ఉంటానని పవన్ చెప్పొచ్చు కదా? బీజేపీతో అంటకాగుతున్న పవన్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. రాష్ట్రంలో జగన్ ఉండకూడదు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నదే పవన్ ధ్యేయం. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పట్టించుకోడు పవన్. పోలవరం నిధులిచ్చి నిర్మించాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఏనాడైనా అడిగావా? పోలవరం, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం పవన్ కు ఉందా?” అని వెల్లంపల్లి శ్రీనివాసరావు నిలదీశారు.