Vizag Beach : పాత సంవత్సరానికి వీడ్కోలు..కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. కానీ..కరోనా..కొత్త వేరియంట్ వారి సంతోషానికి బ్రేక్ లు వేస్తోంది. భారీగా కేసులు నమోదవతుండడంతో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో నిబంధనలు విధించాయి. ఏపీలో కూడా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలున్నాయి. తాజాగా..విశాఖ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తామని వెల్లడిస్తున్నారు.
సరదాగా..బీచ్ లో ఎంజాయ్ చేద్దామని అనుకుని..ఇక్కడకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. బీచ్లో ఎంజాయ్ చేసి కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిద్దామనుకున్న వారికి మరోసారి నిరాశే మిగిలింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా విశాఖ బీచ్రోడ్డు కర్ఫ్యూ వాతావరణంలోకి వెళ్లనుంది. 2021, డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 2022, జనవరి ఫస్ట్ ఉదయం 6 గంటల వరకు బీచ్ రోడ్డులో ఆంక్షలు విధించారు పోలీసులు. యారాడ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని దారులు మూసివేశారు. నగరంలోని ఫ్లైఓవర్లు, ప్రధాన కూడళ్లు కూడా క్లోజ్ చేస్తున్నట్లు సీపీ మనీష్ కుమార్ తెలిపారు. పర్యాటకులు ఎవ్వరు బీచ్లోకి ఎంటర్ కాకుండా బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు సైతం పహారా కాస్తున్నారు.
Read More : Judgement: యావజ్జీవ శిక్ష వేశారని న్యాయమూర్తిపైకి చెప్పు విసిరిన దోషి
గుంపులుగా బయటికి వచ్చి కేక్లను కట్ చేయడంతో పాటు, సెలబ్రేషన్స్ నిర్వహించడంపై నిషేధం విధించారు. శుక్రవారం అర్ధరాత్రి బైకులపై తిరుగుతూ హడావుడి చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని మనీష్ కుమార్ హెచ్చరించారు. రెస్టారెంట్లు, వైన్ షాపులు వాటి టైమింగ్ ప్రకారం ఓపెన్ ఉంటాయని వెల్లడించారు. ఎక్కడా డీజేలు పెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరి ఇంట్లో వారే న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించారు. లేకపోతే పోలీస్ స్టేషన్లో తమతో కలిసి న్యూ ఇయర్ చేసుకోవాలన్నారు సీపీ. నిబంధనలు ఎవ్వరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.