YCP High Command Talks With Minister Gummanur Jayaram
Gummanur Jayaram : కర్నూలు జిల్లా ఆలూరు టికెట్ అసంతృప్తిపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు యత్నిస్తున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని దూతగా పంపించారు. గుమ్మనూరు జయరాంతో రామసుబ్బారెడ్డి గంటపాటు చర్చించారు.
ఎంపీ వద్దు ఎమ్మెల్యే టికెటే కావాలని గుమ్మనూరు జయరాం పట్టుబడుతున్నారు. కావాలంటే తన వారసుడు గుమ్మనూరు ఈశ్వర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని జయరాం తెలిపారు. నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తనను ఎమ్మెల్యేగానే ఉండమని కోరుతున్నట్లు రామసుబ్బారెడ్డికి జయరాం చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల
కర్నూలు జిల్లా ఆలూరు టికెట్ విషయంలో గుమ్మనూరు జయరాం.. దాదాపు వారం రోజులుగా అలకబూనారు. దీంతో వైసీపీ అధిష్టానం.. మంత్రిని బుజ్జగించేందుకు చర్యలు చేపట్టింది. మాజీమంత్రి, ఎమ్మెల్సీ, కర్నూలు నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న రామసుబ్బారెడ్డిని రంగంలోకి దింపింది వైసీపీ అధినాయకత్వం. గుమ్మనూరు జయరాంను బుజ్జగించే బాధ్యతను ఆయనకు అప్పగించింది. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాంతో రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు.
తనకు ఎమ్మెల్యే టికెటే కావాలని గుమ్మనూరు జయరాం పట్టుబడుతున్నారు. ఇదే విషయాన్ని తన వద్దకు దూతగా వచ్చిన రామసుబ్బారెడ్డికి తేల్చి చెప్పారాయన. నేను ఎంపీగా వెళితే ఆలూరు నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ఉన్న కేడర్ దెబ్బతింటుందని, అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జయరాం.. రామసుబ్బారెడ్డికి చెప్పినట్లు సమాచారం.
కాగా.. మీకు భవిష్యత్తు ఉంటుంది, ఎంపీగా వెళితే బాగుంటుంది అని మంత్రి గుమ్మనూరుకు రామసుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, గుమ్మనూరు జయరాం మాత్రం ఎంపీగా వెళ్లేందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఒకవేళ తన వారసుడు గుమ్మనూరు ఈశ్వర్ కి ఆలూరు టికెట్ ఇస్తే మాత్రం.. తాను ఎంపీగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు గుమ్మనూరు జయరాం చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read : రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
సీఎం జగన్ వైసీపీ నియోజకవర్గాల ఇంఛార్జ్ లను మార్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు జగన్. ఆయనకు ఈసారి ఆలూరు టికెట్ ఇవ్వలేదు. అయితే, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం సుముఖంగా లేరు. అవసరమైతే పార్టీ వీడేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు.