Amanchi Swamulu : ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కుతున్నారు.. వైసీపీ పతనానికి రోజులు దగ్గరపడ్డాయి : ఆమంచి స్వాములు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆ స్థాయి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం దారుణం అన్నారు.

Amanchi Swamulu (1)
Amanchi Swamulu Fire YCP : వైసీపీపై జనసేన నేత ఆమంచి స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పతనానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆ స్థాయి వ్యక్తిపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం దారుణం అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన బాపట్లలో మీడియాతో మాట్లాడారు.
ఎటువంటి ఆందోళనలు చేయకుండానే జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి రోడ్డు మార్గాన వస్తున్న పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుపెట్టుకొని ఆపేందుకు ప్రయత్నించడం వైసీపీ పతనానికి నాంది అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వకుండానే క్షణాల్లో లక్షల మంది జనం రోడ్లపై వచ్చారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు చీమంత హాని తలపెట్టినా రాష్ట్రం అష్టదిగ్బంధనం అవుతుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు రాష్ట్రం నుండి తరిమికొడతారని పేర్కొన్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరులో ఉద్రిక్తత నెలకొంది.
బంద్ నిర్వహిస్తున్న మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ ను పోలీసులు ఈడ్చి పడేశారు. ఈ క్రమంలో పోలీసులతో చంద్ర శేకర్ వాగ్వాదానికి దిగారు. అతన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. బంద్ కు పిలుపు ఇచ్చిన బొమ్మల సెంటర్ లో ప్రజలు బంద్ కు సహకరించాలని చంద్రశేఖర్ కోరారు.