Sajjala Ramakrishna Reddy
CM Jagan Birthday : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగన్ పుట్టినరోజు ప్రతి ఇంట్లో సొంత బిడ్డ పుట్టినరోజు పండగలా చేస్తున్నారని చెప్పారు.
Also Read : Deputy Speaker : యువగళం సభలో అనుభవాలు చెప్పడం కన్నా జగన్ ను విమర్శించడమే ఎక్కువ : డిప్యూటీ స్పీకర్
చంద్రబాబుకు హామీలు ఇవ్వడమే తప్ప అమలుచేసే అలవాటు లేదని, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారని సజ్జల విమర్శించారు. అధికారం ఉండగానే దోచుకోవటం, ఎన్నికలు వస్తే ఉత్తిత్తి హామీలు ఇవ్వడం చంద్రబాబు నైజం అని, ఆయన నైజాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఓడించి ఇంటికి పంపించారని అన్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ పాలనను మళ్లీ తెస్తానని చెప్పి ప్రజల్లోకి చంద్రబాబు మళ్లీ వెళ్లగలడా? అంటూ సజ్జల ప్రశ్నించారు.
Also Read : Chandrababu Naidu: అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది.. రాష్ట్రం మొత్తం..: చంద్రబాబు
లోకేశ్ తన పాదయాత్రలో ఏవో ప్రజల కష్టాలు చూశానని అంటున్నాడు.. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వారి కష్టాలు చూడలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ ప్రజల కష్టాలు పట్టించుకున్నాడా? టీడీపీ నిజంగా అద్భుతాలు చేస్తే మంగళగిరిలో లోకేశ్ ఎందుకు ఓడిపోయాడో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనని సజ్జల దీమా వ్యక్తం చేశారు.