YCP MP’s Meet Modi: ఓబీసీ రిజర్వేషన్ అంశంపై ప్రధాని మోదీతో చర్చించిన వైకాపా ఎంపీలు
ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చించేందుకు వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు బుధవారం ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు
- Bharath Reddy
- Published On : March 30, 2022 / 03:37 PM IST
Modi
YCP MP’s Meet Modi: ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చించేందుకు వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు బుధవారం ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రధాని మోదీని కలిసి వైకాపా ఎంపీలు..కులాల వారీగా జనగణన జరిపించాలని కోరినట్లు తెలిపారు. అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ బీసీ జనాభాకు తగినంత రిజర్వేషన్ కల్పించాలని కోరామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ కులగణన జరపకుండా రిజర్వేషన్లలో రాజ్యాంగ సవరణ చేస్తే కోర్టులు తప్పు పట్టే అవకాశం ఉందని, కుల జనగణన లెక్కలు లేకుండా రిజర్వేషన్లలో మార్పులు చేయలేమని అన్నారు.
Also read:Hyderabad : వివాదమవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..స్పీకర్ కు తప్పని తిప్పలు
జ్యుడీషియరీలో రిజర్వేషన్లు అమలు జరపాలని..బీసీ జనాభాకు తగినంత రిజర్వేషన్ కల్పించాలని ప్రధానిని కోరినట్లు ఎంపీ సుభాష్ చంద్రబోస్ వివరించారు. న్యాయ వ్యవస్థలో జడ్జి పదవుల్లో బీసీలకు, ఎస్సీ, ఎస్టీ లకు సరియైన ప్రాతినిధ్యం దక్కడం లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈసందర్భంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పెండింగులో ఉన్న అతి ప్రధాన సమస్య ఓబీసీ రిజర్వేషన్ గురించి ప్రధానితో మాట్లాడామని అన్నారు. త్వరితగతిన బీసీ వర్గాల డిమాండ్ ను అమలు జరపాలని..స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో బీసీ కులగణన పై స్పష్టత లేదని మోపిదేవి వెంకటరమణ అన్నారు.
బీసీ వర్గాల సముచిత న్యాయం కులగణన వల్లనే సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం చేయకుండా.. రాష్ట్రల్లో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించారని మోపిదేవి వివరించారు. తమ ప్రతిపాదన పై ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు న్యాయం చేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీలను రాష్ట్రంలో ముందుకు తీసుకువెళుతున్న విధంగా జాతీయ స్థాయిలో కూడా తీసుకువెళ్లాలని ప్రధానిని కోరినట్లు మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
Also read:Rahul Gandhi: “ప్రధాని మోదీ దిన చర్య ఇదే” అంటూ రాహుల్ ట్వీట్
