Dussehra 2025: చెడుపై మంచి గెలుపు… దసరా వెనుక చరిత్ర తెలుసుకోవాల్సిందే!

దసరా పండుగను అందరూ సరదాగా జరుపుకుంటారు సరే.. ఈ పండుగ 10 రోజులు జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఇప్పటి జనరేషన్స్‌కి తెలియకపోవచ్చును. దసరా వేడుకను జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే?

Dussehra 2025: చెడుపై మంచి గెలుపు…  దసరా వెనుక చరిత్ర తెలుసుకోవాల్సిందే!

Updated On : October 1, 2025 / 8:08 PM IST

దసరా పండుగ అంటే అందరికీ ఇష్టమైన వేడుక. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీనిని జరుపుకుంటారు. పదిరోజుల పాటు నిర్వహించే ఈ పండుగ వెనుక అనేక పురాణ కథలున్నాయి. ఆశ్వయుజ మాసంలో జరుపుకునే దసరా, దుర్గమాత పూజలతో ప్రారంభమవుతుంది. ఈ పండుగకు రెండు ప్రధాన పురాణ కథలు మూలంగా ఉన్నాయి.

1. శ్రీరాముడి విజయం:

రాక్షస రాజైన రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటారు. రావణుడి భారీ దిష్టిబొమ్మలను బాణసంచాతో కాల్చి ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు. రావణుడిని వధించిన తర్వాత శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చినట్లు చెబుతారు. విజయదశమి నాడు పాండవులు తమ వనవాసం ముగించుకుని, జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా కూడా దీనిని పరిగణిస్తారు.

2. మహిషాసుర సంహారం:

జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు ఏకధాటిగా యుద్ధం చేసి సంహరించిన సందర్భాన్ని దసరా పండుగగా జరుపుకుంటారు. దీనిని విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.

మహిషాసుర వృత్తాంతం:

బ్రహ్మ వరాల వల్ల అహంకారి అయిన మహిషాసురుడు దేవతలను ఓడించి ఇంద్రపదవిని ఆక్రమించాడు. అతని ఆగడాలు తట్టుకోలేక ఇంద్రుడు త్రిమూర్తులకు మొరపెట్టుకున్నాడు. మహిషుని దురాగతాలపై త్రిమూర్తులలో రగిలిన క్రోధాగ్ని నుండి ఒక స్త్రీ రూపం జన్మించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా ఆమె జన్మించింది. 18 బాహువులను కలిగి ఉన్న ఆ దుర్గాదేవికి శివుడు శూలం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం వంటివి ఇచ్చారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. దేవతలంతా ఇచ్చిన ఆయుధాలతో అమ్మవారు మహిషాసురుడితో భీకర యుద్ధం చేసింది. మహిషుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు వంటి రాక్షసులను సంహరించింది. చివరికి మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషుడిని సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటున్నాము.

విజయదశమి ఆచారాలు:

విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజును శుభానికి సూచనగా భావించి కొందరు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, కొత్త పెట్టుబడులు పెడతారు. కొన్ని రాష్ట్రాల్లో చిన్నపిల్లలను స్కూల్లో చేరుస్తారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలలో దసరాను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. రాముని జీవిత కథను నాటకాలుగా ప్రదర్శిస్తారు. బెంగాలీలు జానపద పాటలు పాడుతారు. దుర్గాదేవి విగ్రహాలను పూజించిన తర్వాత నిమజ్జనం చేస్తారు. విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదం అంటారు. ఆ రోజు జమ్మి ఆకులను ఇళ్లలో ఉంచుకుంటారు, బంధువులకు ఇస్తారు. ఇలా చేయడం ద్వారా సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు.