భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది. సోమవారం(ఏప్రిల్ 8, 2019) ఒక్క రోజే రూ. 425 పెరిగింది. దీంతో బంగారం ధర ధర మళ్లీ రూ. 33వేల మార్క్ను దాటింది. డిమాండ్ లేకపోవడంతో కొంత దిగొచ్చిన బంగారం ధర.. మళ్లీ పెరుగుతూ పోతోంది. సోమవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ. 33,215 పలికింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కేజీ వెండి ధర రూ. 170 పెరిగి రూ. 38,670కి చేరింది. అంతర్జాతీయంగానూ వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1,298.30 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.23 డాలర్లుగా ఉంది.