Individuals can now set up EV charging stations
EV Charging Stations : ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. వాహనదారులు సైతం ఈవీ వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఫ్యూయిల్ ఇంజిన్లతో నడిచే వాహనాల కన్నా పర్యావరణ అనుకూలమైన ఈవీ వాహనాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. వాహనదారుల డిమాండ్ తగినట్టుగా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు సైతం సరికొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
చూస్తుంటే.. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే ఆదిపత్యంగా కనిపిస్తోంది. ప్రతిఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ డిమాండ్ తగినట్టుగా మార్కెట్లో చాలా చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువగా ఉండటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో బ్యాటరీ పవర్ డౌన్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడం ఎలా అని చాలామంది ఈవీ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుతో ఆదాయం :
ప్రస్తుతం పెట్రోల్ బంకులు సమీపంలో ఉన్నట్టుగా ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులో ఉంటే బాగుండు అనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆసక్తిగల వారు ఎవరైనా కొత్తగా బిజినెస్ పెడతామని ఆలోచించేవారు అయినా ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఏర్పాటు కోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందించాలన నిర్ణయించింది.
ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఎంతంటే? :
(TGREDCO) అధికారుల ప్రకారం.. 300 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు ప్లాట్ సైజులు ఉన్న వ్యక్తులు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా (REDCO) సంప్రదించాల్సి ఉంటుంది.
“ఒకవేళ సొంత ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుకు ఆసక్తి చూపకపోతే తమ భూమిని ఏజెన్సీలకు లీజుకు ఇచ్చి నెలవారీ అద్దె కూడా పొందవచ్చు” అని అధికారులు సూచించారు. అంతేకాదు.. నాలుగు చక్రాల వాహనం, రెండు ద్విచక్ర వాహనాల కోసం ప్రాథమిక ఎలక్ట్రిక్ వాహనాల స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు ఎంత ఖర్చు అవుతుందో కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు.
ఛార్జింగ్ స్టేషన్కు లైసెన్స్ అక్కర్లేదు కానీ :
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిస్తోంది. అయితే ఛార్జింగ్ స్టేషన్ భద్రత, సామర్థ్యంతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం చాలా కీలకమని అధికారులు తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ముందుగా ల్యాండ్ ఎంచుకోవడం, విద్యుత్ సరఫరాకు సామీప్యత, వినియోగదారులకు యాక్సస్ వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ అనుమతులు తప్పనిసరి :
సరైన ల్యాండ్ ఎంచుకున్న తర్వాత ఈవీ ఛార్జింగ్ స్టేషన్ యజమానులు స్థానిక అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు లేదా లైసెన్స్లను పొందడం చాలా ముఖ్యం. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ అవసరం లేదు. కానీ, డ్రిస్టుబ్యూషన్ సిస్టమ్ ఏర్పాటుకు తప్పక అనుమతి పొందాలి.
ఈ ప్రక్రియను ఆ ప్రాంత విద్యుత్ శాఖ నిర్వహించాలి. లైసెన్స్, పర్మిట్ పొందిన తర్వాత మీరు సైట్లో ఛార్జర్లు, కనెక్టర్లు, ఇతర వస్తువుల వంటి ఛార్జింగ్ పరికరాలను ఇన్స్టాల్ చేయవచ్చు. ఇంకా, కస్టమర్ల నుంచి పేమెంట్లను పొందడానికి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కూడా చాలా కీలకమని గమనించాలి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. :
అన్ని పరికరాలు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వినియోగదారులు తమ కార్లను పార్క్ చేసి ఛార్జ్ చేసుకోగలిగేలా ఉండాలి. సురక్షితమైన పార్కింగ్ కలిగిన ప్రాంతం ఉండాలి. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లో ఇన్స్టాల్ చేసిన అన్ని ఛార్జర్ మోడల్లు అంతర్జాతీయ, జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
వాహన యజమానులు ఉపయోగించే స్లో ఛార్జర్లు, రాపిడ్ ఛార్జర్లు, ఇతర ఈవీ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయాలి. ఏవైనా సంఘటనలు లేదా ప్రమాదాలను నివారించడానికి ఛార్జింగ్ స్టేషన్లలో భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ ఛార్జింగ్ స్టేషన్లు దాదాపు 425 పనిచేస్తున్నాయి. ప్రస్తుతం, రాష్ట్రంలో 1.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు, 1.3 లక్షల బైక్లు, 12,765 కార్లు ఉన్నాయి.