భారత్లో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9వ ధనవంతుడిగా నిలిచారు. ఫేమస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీకి చోటు దక్కింది.
దేశంలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువతో తొలి భారతీయ కంపెనీగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ర్యాలీ ఒక్కసారిగా పైకి ఎగయడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభలో విడుదల చేసిన ప్రపంచ ఫోర్బ్స్ 2019 జాబితాలో RIL చైర్మన్ అంబానీ 13వ ర్యాంకులో ఉన్నారు. RIL కంపెనీ షేర్లు పెరగడంతో అంబానీ మార్కెట్ విలువ కూడా అమాంతం పెరిగిపోయింది.
ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ నాలుగు ర్యాంకులు మెరుగుపర్చుకుని 60.8 బిలియన్ డాలర్ల ఆదాయ విలువతో 9వ ర్యాంకులో నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్ల నికర విలువ, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నికర విలువ 107.4 బిలియన్ డాలర్లతో ముందువరసలో ఉండగా తర్వాత అంబానీ నిలిచారు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. నికర ఆదాయ విలువ పెరిగిన ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, జాక్ మా తర్వాతి స్థానాల్లో అంబానీ నిలిచారు. గూగుల్ ఫౌండర్స్ లారీ పేజ్ (59.6 బిలియన్ డాలర్లు), మిచెల్ బ్లూమ్ బెర్గ్ (54.7 బిలియన్ డాలర్లు) సెర్గీ బ్రిన్లను ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టేశారు. వీరిద్దరి ఆదాయం విలువ వరుసగా 59.6 బిలియన్ డాలర్లు, 57.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
గురువారం (నవంబర్ 28, 2019) BSEలో రిల్ కంపెనీ షేర్లు 0.64శాతానికి పెరిగి 52 వారాల గరిష్టానికి రూ.1,581.25 వద్ద ట్రేడ్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రిల్ కనీసం 40శాతం మేర లాభాలు గడించగా, నిఫ్టీ50 సూచిక 13శాతంతో మందుంజలో నిలిచింది.
రిలయన్స్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండో దేశీయ అతిపెద్ద కంపెనీగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో HDFC బ్యాంకు, హిందుస్థాన్ అన్ లివర్, HDFC సహా ఇతర కంపెనీలు నిలిచాయి.