New Tatkal Ticket Rule
New Tatkal Ticket Rule : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్ టికెట్ బుకింగ్ చేస్తున్నారా? జూలై 1 నుంచి కొత్త తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ 2025 అమల్లోకి రానున్నాయి. ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్ చేసేందుకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి. IRCTC ద్వారా బుకింగ్ చేసుకునే కస్టమర్లకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఉండాలి.
ఆధార్ అథెంటికేషన్ కలిగిన ప్రయాణికులు మాత్రమే తత్కాల్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. ఈ మేరకు అన్ని రైల్వే శాఖలకు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక సర్య్యూలర్ జారీ చేసింది. అంతేకాదు.. జూలై 15 నుంచి అదనంగా ఆధార్ ఆధారిత OTP వెరిఫికేషన్ కూడా తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది.
తత్కాల్ కింద టిక్కెట్లను ఆధార్ అథెంటికేషన్ యూజర్లు మాత్రమే IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. తత్కాల్ బుకింగ్లకు సంబంధించి భారత రైల్వే అధీకృత టికెటింగ్ ఏజెంట్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లకు కూడా పరిమితులను విధించింది.
మొదటి 30 నిమిషాల వరకు నో ఎంట్రీ :
ప్రయాణికుల మొబైల్ ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్ బుకింగ్ చేయగలరని తెలిపింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం అధీకృత ఏజెంట్లకు తొలి 30 నిమిషాలు పొందలేరని రైల్వే శాఖ స్పష్టంచేసింది. అంటే.. ఈ ఏజెంట్లు బుకింగ్ విండో మొదటి 30 నిమిషాల వ్యవధిలో మొదటి రోజు తత్కాల్ టిక్కెట్లను పొందలేరు.
ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లు ఉదయం 10 గంటల నుంచి ఉదయం 10.30 వరకు, నాన్ ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్కు ఉదయం 11.00 నుంచి ఉదయం 11.30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, IRCTC తమ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచనలు చేసింది. అనధికారిక టికెట్ బుకింగ్ చేసేవారికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.
ఇకపై 24 గంటల ముందే వెయిటింగ్ లిస్ట్ సమాచారం :
రైలు బయల్దేరేందుకు 4 గంటల ముందు మాత్రమే ప్రయాణికులకు వెయిటింగ్ లిస్ట్ సమాచారం తెలుస్తోంది. కానీ, ఇకపై అలా కాదు.. వెయిటింగ్ లిస్ట్ కన్ఫార్మేషన్ స్టేటస్ 24 గంటల ముందు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వచ్చిన తర్వాతే పైలట్ ప్రాజెక్ట్ విధానం అమల్లోకి రానుందని మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. “మేం ఈ పైలట్ ప్రాజెక్టును బికనీర్ డివిజన్లో ప్రారంభించాం. ఇక్కడ రైలు బయల్దేరేందుకు 24 గంటల ముందు చార్టులు రెడీ అవుతాయి. ప్రస్తుత పద్ధతి 4 గంటల ముందు చార్ట్ రెడీ చేస్తోంది” అని రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు.
వెయిటింగ్ టికెట్ కారణంగా ప్రయాణీకుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రయల్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. “ఇప్పుడు, టిక్కెట్లు కన్ఫార్మ్ అయినట్టుగా 24 గంటల ముందే తెలిస్తే.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు” అని చెప్పారు. అయితే, టికెట్ కన్ఫార్మ్ అయ్యాక క్యాన్సిల్ చేసుకుంటే ప్రయాణీకులు చెల్లించిన మొత్తంలో ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది.
క్యాన్సిల్ పాలసీ ప్రకారం.. ట్రైన్ బయల్దేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు కన్ఫార్మ్ టికెట్ రద్దు అయితే.. ప్రయాణీకులకు టికెట్ మొత్తంలో 25 శాతం తిరిగి పొందుతారు. అదే ట్రైన్ బయల్దేరడానికి 12 గంటల నుంచి 4 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే.. వారికి 50 శాతం మాత్రమే తిరిగి రీఫండ్ అవుతుంది. టికెట్ క్యాన్సిల్ కారణంగా ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్తులను ప్రస్తుత బుకింగ్ విధానం ద్వారా రీప్లేస్ చేస్తారు” అని అధికారులు పేర్కొన్నారు.