అన్నా చెల్లెల్లే.. భార్యా భర్తలయ్యారు.

ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పచుకునేందుకు అన్నాచెల్లెలు ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్యా భర్తలుగా చెలామణి అవుతున్న వీరి బాగోతం వెలుగులోకి వచ్చింది. తన పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇదంతా చేశారని వీరి బంధువు ఒకామె పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. ఫిర్యాదు ఆధారంగా బథిండా జిల్లాలోని బాలియన్వాలా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరితో పాటు వారి ఆరుగురు కుటుంబ సభ్యుల పేర్లు కూడా (FIR) పేర్కొన్నట్టు బాలియన్వాలా SI జైసింగ్ తెలిపారు.
2012లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉన్నారని, దర్యాప్తు పూర్తి చేశామని SI తెలిపారు. ఈ కేసు తమను షాక్కు గురి చేసిందని పోలీసులు తెలిపారు. వీసా కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతుండడం చూశాంగాని, ఇలా అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్నట్టుగా నటించడం ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యపోయారు.
నకిలీ పెళ్లి పత్రాలతో తమ దేశానికి రావాలని చూస్తే కఠిన దండన తప్పదని భారతీయులకు గత ఏడాది ఆస్త్రేలియా హెచ్చరిక జారీ చేసింది. 32 ఏళ్ల భారతీయుడొకరు నకిలీ వివాహ పత్రాలతో దొరికిపోవడంతో ఈమేరకు వార్నింగ్ ఇచ్చింది.