CBI : కేంద్ర నామినేటెడ్ పదవులపై ఆశ చూపించి రూ.100 కోట్ల రూపాయల మేర మోసం చేయటానికి ప్రయత్నిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును సీబీఐ అధికారులు రట్టు చేశారు. ఇందులో భాగంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
రూ. 100 కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు కానీ, రాష్ట్రానికి గవర్నర్ పదవి కానీ ఇప్పిస్తామని నిందితులు ప్రచారం చేసుకుంటున్నారు. మహరాష్ట్రలోని లాతూర్ కు చెందిన కమలాకర్ ప్రేమ కుమార్ బండ్ గార్, కర్ణాటకలోని బెలగామ్ కు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరా, మహ్మాద్ ఐజాజా ఖాన్ లు ఈ ముఠాను నడిపిస్తున్నట్లు సీబీఐ కి సమాచారం అందింది.
వీరిలో నలుగురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఈ ముఠాలో మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బండగార్ సీబీఐలోని తనకు తెలిసిన అధికారుల పేర్లు చెప్పి తానూ సీబీఐ అధికారినని చెప్పుకుంటున్నాడు. అనేక పోలీసు స్టేషన్లలోని పోలీసు అధికారులను బెదిరించి తనకు సంబంధం ఉన్న వ్యక్తులకు సహాయం చేయటానికి లేదా పెండింగ్ లో ఉన్న కేసులను ప్రభావితం చేయటానికి ప్రయత్నించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.