Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు
సంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
- Narender Thiru
- Published On : February 26, 2023 / 01:47 PM IST
Jammu and Kashmir: జమ్మూ-కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. ఒక కాశ్మీర్ పండిట్ను కాల్చి చంపారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలో ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో జరిగింది. సంజయ్ శర్మ(40) అనే వ్యక్తి స్థానికంగా ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
సంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి భద్రతా దళాలు వెంటనే స్పందించాయి. ఈ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి, పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఏరియా మొత్తాన్ని భద్రతా దళాలు గాలిస్తున్నాయి. తీవ్రవాదుల కోసం సోదాలు చేస్తున్నాయి.
ఈ దాడిని నాలుగు నెలల తర్వాత ఈ ప్రాంతంలో హిందువులపై జరిగిన మొదటి ఘటనగా పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం అసిఫ్ అలి గనాయ్ అనే మరో వ్యక్తిని టెర్రరిస్టులు కాల్చారు. ఇతడి తండ్రి కూడా గత ఏడాది జరిగిన టెర్రిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. కాశ్మీర్లో ఇటీవల మైనారిటీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది తీవ్రవాదుల దాడిలో 14 మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు కాశ్మీరీ పండిట్లు ఉన్నారు.
