KONDAGATTU
Kondagattu Temple Burglary : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ కేసులో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు ఉన్నట్లు సమాచారం. కర్నాటకలోని బీదర్ లో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగల లొకేషన్ ను కనిపెట్టారు.
దొంగిలించిన సొమ్ములో 60శాతం రికవరీ చేసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగలు చోరీ చేశారు. స్వామి వారి శఠగోపంతో పాటు వెండి వస్తువులు దోచుకెళ్లారు. కొండగట్టు ఆలయ చరిత్రలో చోరీ జరగడం ఇదే తొలిసారి. ముసుగు వేసుకుని వచ్చిన దొంగలు చోరీకి పాల్పడ్డారు.(Kondagattu Temple Burglary)
కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. అలాంటి అంజన్న ఆలయంలో దొంగతనం జరగడం తీవ్ర కలకలం రేపింది. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ముఖానికి మాస్క్ వేసుకుని చేతిలో దొంగలించిన గుడి వస్తువులను తీసుకుని వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Also Read..Abdullapurmet Incident : నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోలీసులే విస్తుపోయే నిజాలు
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 2 కిలోల స్వామి మకరతోరణం, అర్థమండపంలో ఆంజనేయ స్వామి వెండి మకర తోరణం ఎత్తుకెళ్లారు. ఇది ఐదు కిలోల వరకు ఉంటుంది. 3 కిలోల శఠగోపాలు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వీటి విలువు సుమారు రూ.9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. దొంగలను పట్టుకునేందుకు 10 పొలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. గురువారం రాత్రి స్వామి వారి పవళింపు సేవ అనంతరం గుడి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు దొంగతనం జరిగినట్లు గుర్తించి షాక్ అయ్యారు.