బాబోయ్.. భర్తతో కలిసి వెళ్తున్నా వదలడం లేదు.. ఏలూరులో కలకలం..

రాత్రి సమయాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.

Chain Snatchers (Photo Credit : Google)

Chain Snatch : గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలనే టార్గెట్ చేసిన చైన్ స్నాచర్స్ ఇప్పుడు.. భర్తతో కలిసి వెళ్తున్న భార్యలను కూడా వదలడం లేదు. పగలు రాత్రి అన్న తేడా లేదు. మహిళల మెడలో నుంచి చైన్లు తెంపుకుపోతున్నారు. ఏలూరులో వరుస చైన్ స్నాచింగ్స్ తో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు.

ఏలూరు జిల్లాలో చైన్ స్నాచర్లు స్వైర విహారం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఒంటరిగా వెళ్తున్న మహిళలను మాత్రమే టార్గెట్ చేస్తూ వారి మెడలోని చైన్లు తెంపుకెళ్లిన దొంగలు ఇప్పుడు మరింత బరితెగించారు. భర్తలతో కలిసి వెళ్తున్న మహిళలను కూడా వదలడం లేదు. భర్త ముందే మహిళ మెడ నుంచి బంగారు చైన్ తెంపుకెళ్తున్నారు.

ఇటీవల భార్య, భర్త వివాహానికి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకెళ్లారు. ఈ ఘటనలో మహిళ బైక్ పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. తాజాగా ఏలూరు జిల్లా గోపన్నపాలెం దగ్గర భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును తెంచుకెళ్లారు. ఈ సమయంలో ఆమె బైక్ పై నుంచి కిందకు పడటంతో తలకు తీవ్ర గాయమైంది.

భర్త పక్కన ఉండగా.. చైన్ స్నాచర్లు ఇలా బరి తెగించిపోవడం మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వరుస ఘటనలతో ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. బంగారు గొలుసుల కోసం ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని వైనం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గొలుసు దొంగల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను కోరుతున్నారు.

కాగా.. రాత్రి సమయాల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. జనాలు ఎక్కువగా లేని ప్రాంతాల్లోనే చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నట్లుగా గుర్తించారు. ప్రయాణ సమయాల్లో ఖరీదైన గోల్డ్ చైన్లు మెడలో వేసుకోకపోవడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : బాబోయ్.. తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్‌పై దాడి..!