మర్డర్ కేసులో కీలక క్లూ : శ్రావణిని బైక్ పై తీసుకెళ్లిన శ్రీనివాస్ రెడ్డి

సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో వారికి క్లూ లభించింది. శ్రావణిని హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణి మర్డర్ కేసులో అనుమానితుడిగా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read : హాజీపూర్ మర్డర్ కేసులు : బావి యజమాని శ్రీనివాస్ రెడ్డిని ఉరి తియ్యాలి
శ్రావణిని బైక్ పై తీసుకెళ్లాడని తేలడంతో.. శ్రావణిని శ్రీనివాస్రెడ్డి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కీసర సర్కిల్ లో శ్రావణిని, శ్రీనివాస్ రెడ్డి బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. కీసర నుంచి బొమ్మల రామారం రూట్లోని సీసీఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీనివాస్కు నేర చరిత్ర ఉందని, అతడిపై హైదరాబాద్, బెంగళూరులో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. బొమ్మల రామారం పరిధిలో బాలికల మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
స్కూల్ కి వెళ్లిన శ్రావణి తిరిగి ఇంటికి రాలేదు. శుక్రవారం (ఏప్రిల్ 26,2019) దారుణ హత్యకు గురైంది. హాజీపూర్ గ్రామంలోని పాడుబడిన బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. అత్యంత దారుణంగా శ్రావణిని చంపేశారు. ఈ దారుణం మరువక ముందే శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మరో అమ్మాయి డెడ్ బాడీ బయటపడింది. సోమవారం (ఏప్రిల్ 29,2019) సాయంత్రం డెడ్ బాడీని గుర్తించారు. ఆ మృతదేహాన్ని మనీషాదిగా ఐడెంటిఫై చేశారు. మనీషా డిగ్రీ విద్యార్థిని. నెల రోజుల క్రితం మిస్ అయ్యింది. ఐడీ కార్డు ఆధారంగా మనీషా మృతదేహాన్ని గుర్తించారు. ఒకే బావిలో రెండు మృతదేహాలు బయటపడటం గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది.