‘Supari’ gangs or contract killers: హైదరాబాద్లో సుపారీ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. పక్కోడి ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు. వాళ్లకు అందాల్సిన లెక్క అందితే, ఎవడి ప్రాణాలైనా లెక్క చేయకుండా తీసేస్తారు. డబ్బులిస్తే చాలు చంపేస్తారు. ప్రాణాలు తీయడమే వాళ్ల పని. వాళ్లే, సుపారీ గ్యాంగ్స్. ముంబై మాఫియాలో పుట్టిన ఈ సుపారీ కల్చర్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎలా ఎంటరైంది?
పోలీసులంటే బెదురు లేదు. కోర్టులన్నా, శిక్షలన్నా లెక్కలేదు. పగలు, రాత్రి తేడా లేదు. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే, కత్తులు, ఇతర ఆయుధాలతో హత్యలకు తెగబడతారు. పక్కా ప్లాన్లు, రెక్కీలతో ఊపిరి తీసేస్తారు.
చనిపోయిన వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. పగలు, ప్రతీకారాలే కాదు. కనీసం పరిచయం కూడా ఉండదు. డబ్బు కోసమే ప్రాణాలు తీసేస్తారు. ఎవరినైనా హతమార్చే సుపారీ కిల్లర్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. ప్రాణాలకు లక్షలు, కోట్లలో ఖరీదు కడుతున్నారు. కనీసం 10 లక్షల నుంచి కోట్ల వరకు డీల్స్ మాట్లాడుకుంటూ నడిరోడ్డు మీదే హత్యలు చేస్తున్నారు.
ముంబై, ఢిల్లీ, యూపీ, బీహార్ లాంటి ప్రాంతాలకే పరిమితమైన సుపారీ గ్యాంగ్స్, ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ మధ్యే ఈ సుపారీ కిల్లర్స్ కల్చర్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటరైంది. ముంబై మాఫియా తరహా సుపారీ మర్డర్స్ పెరుగుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు సైతం కిరాయి హంతకులుగా మారుతుండటం ఆందోళనకరం.
ఇంతకీ.. సుపారీ అంటే ఏమిటి? సుపారీ కిల్లర్స్ అంటే ఎవరు? సుపారీ కల్చర్ ఎలా విస్తరించింది?
ఓ వ్యక్తిని చంపడానికి కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకుని, డబ్బులు ఇవ్వడాన్నే సుపారీ అంటారు. డబ్బులు తీసుకొని హత్యలు చేసే కిరాయి హంతకులే సుపారీ కిల్లర్స్. ఈ సుపారీ కల్చర్ ముంబై మాఫియాలో పుట్టింది. ముంబైతో పాటు ఢిల్లీ, యూపీ, బీహార్లో సుపారీ కిల్లర్ గ్యాంగ్స్ హై ప్రొఫెషనల్గా పని చేస్తున్నాయి. ముంబై మాఫియా అడ్డాగా దేశవ్యాప్తంగా హిట్మెన్ సుపారీ నెట్వర్క్ను పెంచుకుంటున్నాయి. టార్గెట్ కెపాసిటీకి అనుగుణంగా కోటికి తగ్గకుండా డీల్ సెట్చేసుకుని మర్డర్కి స్కెచ్ వేస్తున్నాయి.
హై ప్రొఫైల్ వ్యక్తులను చంపేందుకు దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ సుపారీ గ్యాంగ్లున్నాయి. డార్క్ వెబ్సైట్స్తో పాటు కాంట్రాక్ట్ కిల్లర్స్ సైట్లో ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకుంటున్నాయి. ఇందులో షార్ప్ షూటర్స్ దగ్గర్నుంచి రకరకాల ప్రొఫెషనల్ కిల్లర్స్ అందుబాటులో ఉంటున్నారని, మర్డర్ లు చేయించాలనుకునేవాళ్లు వాళ్లను కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు కేస్ స్టడీస్ చెప్తున్నాయి. టార్గెట్, సుపారీ ఇచ్చేవారి స్థితిగతులను బట్టి, కోటి నుంచి 50 కోట్ల వరకూ డీల్స్ జరుగుతున్నాయంటున్నారు. అడ్వాన్స్గా 25 శాతం తీసుకుంటున్నారని, టార్గెట్ ప్రాణాలు తీశాక.. మిగతా డబ్బులు వసూలు చేసుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు.