Medico Preethi Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డాక్టర్ ప్రీతి కేసులో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎంజీఎం అనస్థీషియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డిని బాధ్యుడిగా చేస్తూ అతడిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికో ప్రీతి ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నాగార్జున రెడ్డి.
విధుల్లో అతడి నిర్లక్ష్యం వల్లే ప్రీతి ఘటనకు ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా ప్రీతి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు అంతా కూడా నాగార్జున రెడ్డి వైపే వేలు చూపిస్తున్నారు. నాగార్జున రెడ్డి అసమర్థ వ్యవహార శైలి వల్లే ప్రీతికి ఇలా జరిగిందని మొదట్నుంచి కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఆ మేరకు నివేదిక అందుకున్న ప్రభుత్వం నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్లో 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం(ఫిబ్రవరి 26) రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించింది. తొలుత ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయినా, ఫలితం లేకపోయింది.
తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు.. ఆమె మృతితో గుండె పగిలేలా విలపించారు. తమ కూతురు పెద్ద ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆ ఆశయం కూడా చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్ ఇచ్చారని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి మరణానికి గల కారణాలు తెలపాలన్నారు.
సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు ప్రీతి ఫిబ్రవరి 18న చెప్పింది. ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకున్న రోజు రాత్రి విధుల్లో ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు డ్యూటీ చేసింది. అనంతరం ఆత్మహత్యకు యత్నించింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఆత్మహత్యకు యత్నించే కంటే ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడింది. సైఫ్ తనతో పాటు చాలా మంది జూనియర్లని వేధిస్తున్నాడని వాపోయింది. సీనియర్లు అంతా ఒకటేనని చెప్పింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో మొర పెట్టుకుంది. తాను సైఫ్పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి తనను ఏం చేస్తారో అంటూ కన్నీటిపర్యంతమైంది.