తెలంగాణలోని వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి మార్చింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి మార్చింది. లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్ తేదీల్లో మార్పు చేసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్లు మాత్రం గతంలో ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సెట్స్ నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ సూచన మేరకు ఈ మార్పులు చేసినట్లు చెప్పారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా నమూనా ఆన్లైన్ పరీక్షలు జరుపుతామని చెప్పారు.
లాసెట్, పీజీ లాసెట్ మే 26కి బదులు మే 20నే నిర్వహిస్తామని తెలిపారు. పీఈ సెట్ను మే 20 నుంచి నిర్వహించాల్సి ఉండగా దాన్ని మే 15 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీజీ ఈసెట్ను షెడ్యూల్ ప్రకారం మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా వాటిని అదే నెల 28 నుంచి 31 వరకు నిర్వహిస్తామని వివరించారు. ఎడ్సెట్ను మే 30, 31 తేదీల్లో నిర్వహించేలా ముందుగా షెడ్యూల్ జారీ చేసినప్పటికీ మే 31నే పూర్తి చేసేలా మార్పులు చేసినట్లు వివరించారు.