ఆమె మనోధైర్యం ముందు కరోనా నిలువలేకపోయింది. కనిపించని లక్షణాలతో కరోనా కాటేసిన ఆమె ధైర్యంగా పోరాడింది. ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటూనే మరోవైపు పరీక్షలు రాసింది. ఆన్లైన్లో పరీక్షలు పూర్తి చేసింది.. చివరకు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. రాష్ట్రానికి చెందిన ఓ యువ విద్యార్థిని ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానశ్రయంలో విమానం దిగగానే అక్కడి నుంచి నేరుగా చెన్నైకు చేరుకుంది.
వెంటనే ఆస్పత్రికి వెళ్లి టెస్ట్లు చేయించుకుంది. అందులో ఆమెకు తొలుత కరోనా నెగిటివ్ వచ్చింది. ఇంటికి వెళ్లి సెల్ఫ్ క్వారంటైన్లో ఉంది. తనతో పాటు వచ్చిన స్నేహితులకు మూడు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు వైద్యులు. వెంటనే ఆలస్యం చేయకుండా మరోసారి కరోనా టెస్టులు చేయించుకునేందుకు వెళ్లింది.
అప్పటికి కూడా తనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అయినా నిర్లక్ష్యం వహించకుండా మళ్లీ టెస్టులు చేయించుకుంది. రెండోసారి కరోనా పాజిటివ్ అని వచ్చింది. మార్చి 16న ప్రభుత్వ ఈఎస్ఐ ఆస్పత్రిలో విద్యార్థిని చేరింది. రెండు వారాలు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎలాంటి డిప్రెషన్కు లోనుకాలేదు. ఆస్పత్రిలోనే తాను పరీక్షలపై దృష్టి సారించింది.
తల్లిదండ్రులు, బంధువులనూ ఎవరినీ కలిసే అవకాశం లేదు. అదే సమయంలో తన యూనివర్సిటీలో పరీక్షల జరగాల్సి ఉంది. ఈ సమయంలో పరీక్షలను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఆస్పత్రిలోనే ఉంటూ ఆన్లైన్లో రెగ్యులర్గా క్లాస్లను వింటుండేది. అలా పరీక్షలకు సన్నద్ధమైంది. చివరికి నాలుగు పరీక్షలను ఆన్లైన్లోనే పరీక్షలను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమెకు మరో రెండు సార్లు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. కరోనా నుంచి బయటపడిన ఆమె ఈనెల 6న డిశ్చార్జ్ అయ్యింది.