TG Free Civils Coaching : నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త.. ఉచితంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్.. ఫ్రీ గా వసతి, భోజనం.. ఎలా అప్లై చేయాలంటే..
TG Free Civils Coaching : సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుదామని భావించే వారికి సర్కార్ శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- May 9, 2026 / 04:57 PM IST
Telangana Minorities Study Circle Free Coaching Programme For UPSC CSE 2026 27 full details here
TG Free Civils Coaching : మన దేశంలో అత్యంత కష్టమైన పరీక్ష అంటే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్విసెస్ ఎగ్జామ్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులభం కాదు. అభ్యర్థులు ఏళ్ల తరబడి పుస్తకాలకే అతుక్కుపోయి.. చదువుతుంటారు. యూపీఎస్సీ పరీక్ష ఎంత కఠినమో.. దాని కోచింగ్ కూడా అలానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో చాలా మంది పేదవారు యూపీఎస్సీ ఆశను వదిలేసుకుంటారు. అలాంటి వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. సివిల్స్ కి ఉచిత కోచింగ్ తోపాటు భోజన, వసతి కల్పించేందుకు ముందుకు వచ్చింది.
సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకునే నిరుపేద అభ్యర్థులకు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ పండగలాంటి వార్త చెప్పింది. హైదరాబాద్లోని తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగాను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (UPSC)కు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ప్రకటన విడుదల చేసింది. అయితే ఇది కేవలం మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. వీరిలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. మే 31, 2026వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి జూన్ 14న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి.. మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉచిత కోచింగ్ ఇస్తారు.
అర్హతలు, ఇతర వివరాలు..
-
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ వంటి మైనార్టీ అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత కోచింగ్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-
ఈ ఉచిత కోచింగ్ సౌకర్యం పొందాలనే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి.
-
దీని ద్వారా మొత్తం 100 సీట్లను ఇందులో భర్తీ చేస్తారు.
-
ఈ సీట్లలో మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు.
-
ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే నెలఖారులోగా దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
-
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 14న అన్ని జిల్లాల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆఫ్లైన్ విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
-
ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
-
మెరిట్లో సీటు పొందిన అభ్యర్థులకు ఏడాది పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ అందిస్తారు.
-
కోచింగ్ సమయంలో డిజిటల్ తరగతి గదులు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ద్వారా తరగతులు నిర్వహిస్తారు.
-
ఇంటర్నెట్, వైఫై సదుపాయం ఉంటుంది. అవసరమైన వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కూడా కల్పిస్తారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. లేదా పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23236112 ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చు.
