UPSC Result 2023: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల
అనిమేశ్ ప్రధాన్కి రెండో ర్యాంక్ రాగా, తెలుగమ్మాయి దొన్నూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.
UPSC Civil Services Result 2023: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రధాన్కి రెండో ర్యాంక్ రాగా, తెలుగమ్మాయి దోనూరి అనన్య రెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, రుహాని నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
ఆ తదుపరి స్థానాల్లో సృష్టి దబాష్, అన్మోల్ రాఠోఢ్, ఆశీష్ కుమార్, ఐశ్వర్యం ప్రజాపతి ఉన్నారు. జనరల్ కేటగిరీలో 347 మంది ఎంపిక కాగా, 303 మంది ఓబీసీ, 165 మంది ఎస్సీ కేటగిరీలో, 86 మంది ఎస్టీ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈడబ్ల్యూఎస్ నుంచి 115 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది.
ఆయా పోస్టుల భర్తీకి 2023 మే 28న ప్రిలిమ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24న మెయిన్స్ నిర్వహించారు. మెయిన్స్లో అర్హత సాధించిన వారికి జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ర్యాంకర్లకు సీఎం రేవంత్ అభినందనలు
సివిల్స్ -2023 ఫలితాల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసుకు ఎంపిక కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.