UPSC Aspirants : తప్పుదారి పట్టించే ‘యూపీఎస్సీ స్టడీ ప్రిపరేషన్’ బ్లాగ్స్కు దూరంగా ఉండండి : ఐఏఎస్ అధికారి సూచన
UPSC Aspirants : యూపీఎస్సీ పరీక్ష కోసం రోజుకు 18 గంటల కన్నా ఎక్కువ గంటలు చదవాల్సిన అవసరం లేదు.. ఇలాంటి తప్పుదోవ పట్టించే బ్లాగ్స్కు దూరంగా ఉండాలని ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సూచించారు.
UPSC Aspirants : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటి. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈ యూపీఎస్సీ పరీక్ష కోసం పోటీపడుతుంటారు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా భావించే ఈ పరీక్షకు వ్యూహాత్మక ప్రణాళిక, అంకితభావం, క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం.
ఈ రోజుల్లో చాలామంది ఆశావహులు యూపీఎస్సీకి సంబంధించి డాక్యుమెంట్ చేయడం, ఇతరులను ప్రేరేపించేలా స్టడీ బ్లాగ్స్ పెరిగిపోయాయి. యూపీఎస్సీ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలామంది ఈ బ్లాగ్స్ చూసి ప్రేరణ పొందుతున్నారు. అయితే, ఇలాంటి వీలాగ్స్ చూసి గుడ్డిగా నమ్మొద్దని ఇటీవలే ఐఏఎస్ అధికారి ఒకరు యూపీఎస్సీ ఔత్సాహికులకు సూచించారు.
రోజుకు 18 గంటల కన్నా ఎక్కువ చదవాలని చెప్పే కొన్ని ‘తప్పుదోవ పట్టించే’ బ్లాగ్స్ నమ్మొద్దని ఆయన సూచించారు. 2009 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శరణ్.. యూపీఎస్సీ ఔత్సాహికులు ఇలాంటి బ్లాగ్స్కు దూరంగా ఉండాలని కోరారు. యూపీఎస్సీలో విజయం సాధించడానికి ఎక్కువ గంటలు చదువుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ‘తప్పుదారి పట్టించడమే.. ఈ బ్లాగులకు దూరంగా ఉండండి. ఇత్నా భీ పధ్నా నహీ హోతా హై (మీరు ఇంత ఎక్కువ చదవనవసరం లేదు)’ అని బ్లాగ్స్ స్క్రీన్షాట్లను కూడా ఆయన ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.
Misleading!!! Stay away from these blogs.
इतना भी नहीं पढ़ना होता है. pic.twitter.com/wn3YKIpekv
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) April 12, 2024
18 గంటలకుపైగా అధ్యయనంలో అర్థం లేదు :
ఐఏఎస్ అధికారి పోస్టుతో సోషల్ మీడియాలో పెద్దచర్చకు దారితీసింది. ఈ పోస్టుపై స్పందించిన నెటిజన్లు కూడా అధికారి శరణ్ సూచనలను సమర్థించారు. చాలా మంది యూజర్లు 18గంటలకుపైగా అధ్యయనం చేయడంలో అర్థం లేదని అన్నారు. ఎన్ని గంటలు కన్నా ఎంత చదివారు అనేది ముఖ్యమన్నారు. ఆశావహులను గందరగోళానికి గురిచేసేలా ఉన్న బ్లాగర్లను కూడా నిందించారు. ఈ సమస్యను ఎత్తి చూపినందుకు ఐఏఎస్ అధికారి శరణ్కి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్ని గంటలు కాదు.. నాణ్యత ముఖ్యం :
‘సర్ నేను ఇటీవల ఒక బ్లాగ్ చూశాను. మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సంబంధిత పరీక్షల గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఈ రకమైన సమస్యను లేవనెత్తినందుకు ధన్యవాదాలు సర్’ అని యూజర్ పోస్టు పెట్టాడు. ఎన్ని గంటలు చదివారు అనేది కాదు, ఎంత అర్థం చేసుకుని గుర్తుపెట్టుకున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. గంటల కొద్ది చదివితే మార్కులు రావు. ఆన్సర్ షీటులో ఏమి రాస్తారు అనేది ముఖ్యమని మరో యూజర్ వ్యాఖ్యానించారు. యూపీఎస్పీ కూడా ఆశావాదుల నుంచి కోరుకునేది అదే.. క్వాంటిటీ కాదు క్వాలిటీ అంటూ మరో యూజర్ పోస్టు చేశారు.
తప్పుదోవ పట్టించే బ్లాగులతో జాగ్రత్త :
పుస్తకాల ముందు ఎన్ని గంటలు గడిపారనేది కాదు.. ఎంత అవగాహన చేసుకున్నారు అనేది ముఖ్యమని ఔత్సాహికులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని నెటిజన్లు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలని, ఇతరులను కాపీ కొట్టకుండా ప్రయత్నించాలని, ఈ రోజుల్లో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో సర్వసాధారణంగా ఉన్న ఈ రకమైన తప్పుదోవ పట్టించే బ్లాగ్లు, ఇతర ఫేక్ వీడియోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దీనిపై స్పందించినందుకు అవనీష్ శరణ్ సర్ కు ధన్యవాదాలు అంటూ నెటిజన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.