ముగిసిన ‘మా’ ఎన్నికలు: అభ్యర్ధులకు జీహెచ్ఎంసీ షాక్

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(MAA) ఎన్నికలు ముగిసాయి. ఈ ఎలక్షన్లో నుంచున్న అభ్యర్ధులకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధలకు విరుద్ధంగా ఫిలిం చాంబర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసినందుకు గాను జీహెచ్ఎంసీ పెనాల్టీలను విధించింది. ప్రధాన అభ్యుర్దులు శివాజీ రాజా, నరేష్లతో పాటు మరికొంత మందికి పెనాల్టీ వేసేందుకు గ్రేటర్ అధికారులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ఫోటోలను తీసుకున్న అధికారులు వాటిని తొలగించారు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకొవాలనే విషయమై అధికారులతో చర్చిస్తామని అనంతరం వారికి ఫైన్ ఎంత వెయ్యాలనే విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇక ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా నేనా? అనే రీతిలో ఎన్నికలలో శివాజీ రాజా, నరేష్లు తలపడుతున్నారు. ఈ ఎలక్షన్ల పోలింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవగా.. చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, ఆర్ నారాయణమూర్తి, రాజీవ్ కనకాల, జీవితా రాజశేఖర్ దంపతులు, హీరోయిన్ ప్రియమణి, యాంకర్లు ఝాన్సీ, సుమలతో పాటు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభిస్తారు. 8 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.