రోడ్లపై చెత్త వేశారని లక్షల్లో జరిమానా

రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై చెత్త వేయడం, సామాజిక బాధ్యత చూపించని వారిపై భారీ జరిమానా పడింది. ఏడు సంస్థలకు గానూ రూ. 1.48 కోట్లు విధించింది జీహెచ్ఎంసి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ప్రకటనలో తెలియజేశారు. అన్ అఫీషియల్ ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్పోస్టర్లు ఏర్పాటు, నాలాలు, రోడ్లపై చెత్తచెదారం డంపింగ్ చేసిన కంపెనీలపైనా, వ్యక్తులపైనా భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు.
నగరాన్ని స్వచ్ఛతతో, పరిశుభ్రంగా ఉంచడమే జీహెచ్ఎంసి లక్ష్యమని వెల్లడించారు. రూల్స్ బేక్ చేసిన ఘటనలపై సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ విభాగం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా పౌరులు సామాజిక బాధ్యతతో ఇటువంటి వాటిపై ఫోటోల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇప్పటి వరకు 44వేల 403 అతిక్రమణల ఫోటోలను సీఈసీ మొబైల్ యాప్ ద్వారా అందినట్లు తెలిపారు.
2019 అక్టోబర్ నుంచి అక్రమంగా ఏర్పాటు చేసిన 8లక్షల 60వేల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించామని అన్నారు. సీఈసీ ద్వారా ప్రతి అతిక్రమణ ఫోటోను జియోట్యాగింగ్ చేసి యూనిక్ నెంబర్ను ఇచ్చి తదుపరి చర్యలకై మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రధానంగా జరిమానా విధించిన 7 సంస్థల వివరాలు:
* The British Spoken English – రూ. 33.6లక్షలు
* The Rapido Taxi – రూ. 13.8లక్షలు
* The Natural Hair Treatment -రూ. 39.5లక్షలు
* The Venkat Jobs In MNC -రూ. 29.4లక్షలు
* The Billsoft Technologies – రూ. 9.4లక్షలు
* ACT Fibernet -రూ. 14.2లక్షలు
* The Hathway Broadband -రూ. 8.1లక్షలు