Pakistan : పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. ప్యాసింజర్ రైలులో ఘటన.. సైనికులతోసహా 24మంది దుర్మరణం
Pakistan : పాకిస్థాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు టార్గెట్గా చేసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడికి పాల్పడింది.
Pakistan
- పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి
- జాఫర్ ఎక్స్ప్రెస్ టార్గెట్గా బీఎల్ఏ అటాక్..
- పలువురు సైనికులతో పాటు 24మంది మృతి
Pakistan : పాకిస్థాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు టార్గెట్గా చేసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడికి పాల్పడింది. సైనిక సిబ్బందిని తీసుకెళ్తున్న రైలులో ఆదివారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 24మంది మరణించారు. 50మందికిపైగా గాయపడినట్లు, మృతుల్లో సైనికులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు.
స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ ఆర్మీకి భారీగా ప్రాణనష్టం జరగాలనే లక్ష్యంతో క్వెట్టా -చమన్ గేట్ సమీపంలో జాఫర్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైలును లక్ష్యంగాచేసుకొని ముందస్తు వ్యూహంలో భాగంగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి పాల్పడ్డాడు. ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. సమీపంలోని భవనాల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా జాఫర్ ఎక్స్ప్రెస్కు చెందిన ఒక బోగీకి మంటలు అంటుకున్నాయి. పేలుడు దాటికి రైలు బోగీలు ఒకపక్కకు ఒరిగిపోవడంతో బోగీల కింద చిక్కుకున్న వారిని స్థానికులు, రెస్క్యూ బృందం బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని నిషేదిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. జాఫర్ ఎక్స్ప్రెస్లో పాకిస్థాన్ సైన్యం క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పెషావర్కు వెళ్తున్నారనే సమాచారంతో ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బీఎల్ఏ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై బలూచిస్థాన్ హోం వ్యవహారాల ప్రత్యేక సహాయకుడు బాబర్ యూసఫ్ జాయ్ మాట్లాడుతూ.. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని, ధృవీకరణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున, పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో గుమిగూడవద్దని ఆయన నివాసితులను కోరారు.
