న్యూ ట్రెండ్ : ఈ నగలు పెట్టుకుంటే పిల్లలు పుట్టరు

వాషింగ్టన్ : టెక్నాలజీ డెవలప్ మెంట్ ఎంతగా అభివృద్ది చెందిందంటే..కత్తిగాటు కూడా పడకుండా ఆపరేషన్లు చేసే స్థాయికి చేరుకుంది వైద్యం శాస్త్రం. ఈ క్రమంలో పిల్లలు పుట్టకుండా చేయించుకునే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విషయంలో సరికొత్త పద్దతిని తీసుకొచ్చారు అమెరికా శాస్త్రవేత్తలు. కుటుంబ నియంత్రణను సులువు చేసేందుకు చేపట్టిన పరిశోధనలతో ఈ సరికొత్త పద్ధతిని తెచ్చారు. పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఆపరేషన్ చేయించుకోనక్కరలేదు..టాబ్లెట్స్ వేసుకోనక్కరలేదు..లూప్స్ వేయించుకోనక్కరలేదు..కేవలం జ్యువెలరీ పెట్టుకుంటే చాలు పిల్లలు పుట్టరట. అదే ఈ కొత్త కుటుంబ నియంత్రణ పద్దతి ప్రత్యేకత.
మహిళలు ఆపరేషన్ అవసరం లేకుండా చెవి రింగు, ఉంగరం, నెక్లెస్లు ధరించడం ద్వారా మహిళల్లో గర్భం రాకుండా నిరోధించవచ్చు అంటున్నారు అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ రకమైన టెక్నాలజీని కుటుంబ నియంత్రణ పద్ధతిని అభివృద్ధి చేశారు. మహిళలు ధరించే ఆభరణాలలో గర్భ నిరోధక హార్మోన్లు కలిగిన పట్టీలను అమర్చారు. వీటిని ధరించగానే అందులోనే హార్మోన్లు చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లి గర్భం రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వెల్లడించారు.