Twitter Eemployees
Twitter Eemployees: ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే సుమారు 75శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మస్క్.. ఏకంగా పలు దేశాల్లో కార్యాలయాలను మూసేస్తున్నాడు. ప్రస్తుతం ట్విటర్ ఆదాయంలో భారీగా తగ్గుదల కనిపిస్తోందని, ఏడాదికి 40శాతం ట్విటర్ ఆదాయం తగ్గిందని ఓ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ నష్టాలను అధిగమించేందుకు మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో వస్తువులనుసైతం వేలానికి పెట్టారు. ట్విటర్ లోగో అయిన పక్షి ప్రతిమతో పాటు, కాఫీ మెషిన్లు, కిచెన్ సామాగ్రి ఇలా కార్యాలయంలోని అన్ని వస్తువులను వేలానికి పెట్టాడు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలోని మొత్తం 631 వస్తువులను వేలానికి పెట్టినట్లు, వీటిద్వారా కోట్లలో ఆదాయం వచ్చినట్లు ఫోర్బ్స్ ఓ కథనంలో పేర్కొంది. అయితే, ట్విటర్ లోగో ప్రతిమకు రూ. 81లక్షలు వచ్చినట్లు తెలిపింది. మరోవైపు ట్విటర్ లోని మరికొంతమంది ఉద్యొగులను తొలగించేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంస్థలో సుమారు 75శాతం మంది ఉద్యోగులను తొలగించిన ఆయన మరో 50 నుంచి 100 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.
ట్విటర్లోని ప్రొడక్ట్ విభాగంలో ఈసారి అత్యధిక తొలగింపులు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఇదిలాఉంటే ట్విటర్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న కార్యాలయాలను మూసివేయాలని మస్క్ అనుకుంటున్నాడని, అదే జరిగితే ఆ కార్యాలయాల్లో పనిచేసే మరికొందరు ఉద్యోగులపైనా వేటుపడుతుందని అంచనా. మరికొందరు ఉద్యోగులను తొలగిస్తే ఆ సంస్థలో ఉద్యోగుల సంఖ్య రెండు వేలకు చేరుకునే అవకాశం ఉంది. గత నెల క్రితం ఇకనుంచి ట్విటర్లో ఉద్యోగులను తొలగించనని ఎలాన్ మస్క్ స్పష్టం చేశాడు. కానీ, నెల రోజుల తరువాత మరికొందరు ఉద్యోగులపై వేటు పడుతుందని ప్రచారం జరుగుతుంటంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.