పాక్ బుద్ధి మరోసారి బయటపడింది.. ఆపరేషన్ ‘బున్యానుమ్ మార్సూస్’ పై పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఏమన్నాడంటే..
అహ్మద్ షరీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలనుబట్టి పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు ఏ స్థాయిలో మద్దతు ఇస్తుందో మరోసారి స్పష్టమైంది.

Pakistan Army spokesperson Ahmed Sharif
Pakistan Army spokesperson Ahmed Sharif : పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే పాకిస్థాన్ భారత్ పై దాడులకు తెగబడింది. భారత మిలటరీ స్థావరాలను టార్గెట్ చేసుకుని పాకిస్థాన్ దాడులకుదిగింది. ఈ దాడులకు ‘బున్యానుమ్ మార్సూస్’ అనే పేరు పెట్టినట్టు పాక్ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ విషయంపై పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. జీహాద్ మా సైనిక శిక్షణ, కార్యకలాపాలలో భాగమని చెప్పారు.
Also Read: ISI Agent: ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్.. భారత్పై భారీ కుట్ర..!
పాక్ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్కు ఇస్లామిక్ పదజాలం వాడటం, తెల్లవారుజామున దాడులకు దిగడం వెనుక ఉద్దేశంపై పాక్ జర్నలిస్టు ఒకరు లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ను ప్రశ్నించగా.. పాకిస్థాన్ ఆర్మీ శిక్షణలో ఇస్లాం ఒక భాగమని చెప్పారు. ఇది మా విశ్వాసం, దైవభక్తి, దేవుని పేరుతో పోరాటం మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అది మా నినాదం, అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తే మా ఆర్మీ చీఫ్ గా ఈ తరహా ఆపరేషన్లు నిర్వహిస్తారు అని చెప్పారు. ‘బున్యానుమ్ మార్సూస్’ను సమర్థిస్తూ.. దీని అర్థం ఉక్కుగోడ. అల్లహ్ కోసం పోరాడేవారు ఉక్కుగోడ లాంటివారని ఆపరేషన్ పేరు వెనక ఉన్న సంకేత అర్థాన్ని సూచిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
అహ్మద్ షరీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలనుబట్టి పాకిస్థాన్ సైన్యం లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులకు బలమైన మద్దతుగా ఉందని స్పష్టమవుతుంది. ఈ ఉగ్రవాద గ్రూపులు చాలాకాలంగా జమ్మూకశ్మీర్, ఇతర ప్రాంతాల్లో పౌరులను, భారత సాయుధ దళాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. మరోవైపు.. అహ్మద్ షరీఫ్ తండ్రి మహమూద్ సుల్తాన్ బషీరుద్దీన్ పాకిస్థాన్ అణుశక్తి కమిషన్ లో మాజీ శాస్త్రవేత్త. ఆయనకు ఒసామా బిన్ లాడెన్ తో సంబంధాలుండేవని. 9/11 దాడులకు ముందు బిన్ లాడెన్ను కలుసుకునేందుకు ఆప్ఘనిస్థాన్ వెళ్లారు. ఆయనను సీఐఏ, ఎఫ్బీఐ ఇంటరాగేట్ చేసింది.
అయితే, ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా భారతదేశం కూడా మీడియా సమావేశం నిర్వహించింది. సరిహద్దు వెంబడి శాంతిని కాపాడటానికి ప్రస్తుత ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే భారతదేశం తగిన విధంగా స్పందిస్తుందని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఎకె భారతి స్పష్టం చేశారు. ఏదైనా అతిక్రమణ చర్యకు పాల్పడితే తగిన సమాధానం ఉంటుందని హెచ్చరించారు.