ట్రంప్ బాధపడి ఉంటాడు : ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి

2019 నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇథియోపియా ప్ర‌ధాని అబే అహ్మాద్ అలీకి దక్కింది. స్వీడిష్ అకాడమీ ఇవాళ అబే అహ్మద్ ను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేతగా ఎంపిక చేపినట్లు ఇవాళ(అక్టోబర్-11,2019)ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఏడాది ప్రకటించింది 100వ నోబెల్ శాంతి బహుమతి. శాంతి స్థాప‌న కోసం, అంత‌ర్జాతీయ స‌హ‌కారం కోసం ఆయ‌న చేసిన కృషిని నోబెల్ క‌మిటీ గుర్తించింది. పొరుగు దేశం ఎరిత్రియాతో ఏళ్ల నాటి స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌ధాని అహ్మాద్ అలీ విశేషంగా కృషి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ట్వీట్‌లో తెలిపింది.

ఏప్రిల్ 2018లో అబే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ వెంట‌నే ఆయ‌న ఎరిత్రియాతో శాంతి చ‌ర్చ‌ల‌కు పునాది వేశారు. ఎరిత్రియా అధ్య‌క్షుడు అవెరికితో ఆయ‌న కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గ‌త ఏడాది జూలై, సెప్టెంబ‌ర్ల‌లో జ‌రిగిన భేటీల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే అంత‌ర్జాతీయ బౌండ‌రీ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు అబే అంగీక‌రించారు. ఒక‌రు ముందుకు వ‌స్తే శాంతి నెల‌కొన‌ద‌ని, అబే ఇచ్చిన స్నేహ హ‌స్తాన్ని ఎరిత్రియా అధ్య‌క్షుడు అందిపుచ్చుకున్నారు. శాంతి ఒప్పందం ద్వారా ఇథియోపియా, ఎరిత్రియా దేశ ప్ర‌జ‌ల్లో పాజిటివ్ మార్పును తీసుకువ‌స్తుంద‌ని నోబెల్ క‌మిటీ అభిప్రాయపడింది.

అయితే ఇటీవల నోబెల్ శాంతి బహుమతి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. న్యాయంగా అయితే తనకు నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడో దక్కాల్సిందని,నోబెల్ శాంతి బహుమతి ప్రకటన విషయంలో అన్యాయం జరగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు వచ్చిందో ఆయనకు కూడా తెలియదని ట్రంప్ అన్నారు.