Kidney Transplantation: కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు.. మనిషికి పంది కిడ్నీ ఇన్నిరోజులు పనిచేయడం ఇదే తొలిసారి..
రోగికి అమర్చిన అవయవాన్ని తిరస్కరించే సంకేతాలు మాకు కనిపించలేదు. అయితే, గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని వైద్యులు తెలిపారు.
- Harishth Thanniru
- Published On : August 17, 2023 / 09:33 AM IST
Pig kidney
Pig Kidney In Brain Dead Patient: కిడ్నీ మార్పిడి చరిత్రలో పెద్ద ముందడుగు పడింది. బ్రెయిన్ డెడ్ అయిన రోగికి అమర్చిన పంది కిడ్నీ నెలరోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. అయితే, మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఇన్నిరోజులు పనిచేయడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్లో ఎన్వైయూ లాంగోన్ హెల్త్ సంస్థ వైద్యులు ఓ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి గత జూలై 14న పంది కిడ్నీని అమర్చారు. అయితే, బుధవారం కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని వైద్యులు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. వారు ఊహించిన దానికంటే బ్రెయిన్ డెడ్ అయిన మనిషిలో పంది కిడ్నీపనిచేస్తోంది. 32 రోజులు అయినప్పటికీ అదిపనిచేసే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని వైద్యులు గుర్తించారు.
Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్
ఎన్వైయూ లాంగోన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్గోమోరీ మాట్లాడుతూ.. బ్రెయిన్ డెడ్ అయిన రోగి శరీరంలో పంది మూత్ర పిండాన్ని అమర్చాం. నెలరోజుల తరువాత ఆ మూత్రపిండం ఎలా పనిచేస్తుందో పరిశీలన చేశాం. రోగికి అమర్చిన అవయవాన్ని తిరస్కరించే సంకేతాలు మాకు కనిపించలేదు. అయితే, గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని తెలిపారు. మనిషి వ్యాధి నిరోధకతకు పంది కిడ్నీ ఎలా పనిచేస్తుందో కూడా చూస్తాం. అందుకోసం మరో రెండు నెలలు కూడా కిడ్నీని అలాగే ఉంచి చూడనున్నామని వైద్యులు తెలిపారు. అన్నీ కుదిరితే త్వరలో సాధారణ రోగులకు కూడా పంది కిడ్నీ అమర్చే ప్రక్రియను ప్రారంభిస్తామని వైద్యబృందం పేర్కొంది. ఇదిలాఉంటే గతంలోనూ ఇలాంటి ప్రయోగం జరిగింది. కానీ, న్యూయార్క్ వర్సిటీ, అలబామా వర్సిటీ చేసిన కిడ్నీ మార్పిడులు రెండు మూడు రోజుల పాటు మాత్రమే పనిచేశాయి.
అమెరికాలో లక్షలాదిమంది మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. వీరిలో లక్ష మందికిపైగా మార్పిడికోసం నిరీక్షణ జాబితాలో ఉన్నారు. మానవదాత అవయవాల కొరత కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 25వేల మంది వరకు తక్కువ మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి జరుగుతుందట. ప్రతీ సంవత్సరం వెయిటింగ్ లిస్టులో ఉన్నవారిలో చాలా మంది మరణిస్తున్నారు. తాజా పరిశోధన ద్వారా మున్ముందు కాలంలో పంది కిడ్నీ మనిషిలో అమర్చే విధానం విజయవంతం అయితే, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఊరటనిచ్చే పెద్ద అంశం అవుతుందని ఎన్వైయూ వైద్య బృందం భావిస్తుంది.
